
ఢిల్లీ: మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్(Kho Kho World Cup 2025) విజేతగా భారత్ మహిళల జట్టు అవతరించింది. ఈ ప్రపంచకప్లో ఆద్యంతం చెలరేగిపోయిన భారత జట్టు(India).. ఫైనల్లో కూడా సత్తాచాటి విజేతగా నిలిచింది. ఈరోజు(ఆదివారం) జరిగిన ఫైనల్లో భారత జట్టు 78-40 తేడాతో నేపాల్(Nepal) జట్టును ఓడించింది. ఫలితంగా తొలి ఖోఖో ప్రపంచకప్లో జగజ్జేతగా నిలిచింది.
ఈ ఫైనల్లో టాస్ గెలిచిన నేపాల్.. ముందుగా భారత్ ను అటాక్ రమ్మని ఆహ్వానించింది. ఇది ఆతిథ్య భారత్కు వరంగా మారగా, పర్యాటక జట్టు నేపాల్కు శాపంగా మారింది. ఆది నుంచి రెచ్చిపోయిన భారత జట్టు. నేపాల్ను వరుస విరామాల్లో తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. ఎక్కడా కూడా నేపాల్కు అవకాశం ఇవ్వకుండా భారత్ తన ఆధిపత్యాన్నిప్రదర్శించింది. కడవరకూ ఇదే ఆట తీరుతో చెలరేగిపోయిన భారత జట్టు.. నేపాల్ను మట్టికరిపించి ప్రపంచకప్ను ముద్దాడింది.