నాకౌట్‌ దశకు భారత టీటీ జట్లు | Indian TT teams for the knockout stage | Sakshi
Sakshi News home page

నాకౌట్‌ దశకు భారత టీటీ జట్లు

Feb 21 2024 4:12 AM | Updated on Feb 21 2024 4:12 AM

Indian TT teams for the knockout stage - Sakshi

బుసాన్‌ (దక్షిణ కొరియా): ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టీమ్‌ చాంపియన్‌షి ప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు నాకౌట్‌ దశకు అర్హత సాధించాయి. గ్రూప్‌–1లోని చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3–2తో స్పెయిన్‌పై గెలిచి 7 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది.

గ్రూప్‌–3లోని చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 3–0తో న్యూజిలాండ్‌ను ఓడించి 6 పాయింట్లతో మూడో స్థానాన్ని సంపాదించింది. నేడు జరిగే నాకౌట్‌ దశ రెండో రౌండ్‌ పోటీల్లో ఇటలీతో భారత మహిళల జట్టు... కజకిస్తాన్‌తో భారత పురుషుల జట్టు తలపడతాయి. క్వార్టర్‌ ఫైనల్‌ చేరితే భారత జట్లకు పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌లు ఖరారవుతాయి.
 
స్పెయిన్‌తో జరిగిన పోటీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన భారత బృందం ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో నెగ్గడం విశేషం. తొలి మ్యాచ్‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ 9–11, 11–9, 11–13, 4–11తో మరియా జియావో చేతిలో... రెండో మ్యాచ్‌లో మనిక బత్రా 11–13, 11–6, 11–8, 9–11, 7–11తో సోఫియా జువాన్‌ జాంగ్‌ చేతిలో ఓడిపోయారు.

మూడో మ్యాచ్‌లో ఐహిక ముఖర్జీ 11–8, 11–13, 11–8, 9–11, 11–4తో ఎల్విరా రాడ్‌పై గెలిచి భారత ఆశలను సజీవంగా నిలిపింది. నాలుగో మ్యాచ్‌లో మనిక బత్రా 11–9, 11–2, 11–4తో మరియా జియావోపై నెగ్గడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో ఆకుల శ్రీజ 11–6, 11–13, 11–6, 11–3తో సోఫియా జువాన్‌ జాంగ్‌ను ఓడించి భారత విజయాన్ని ఖాయం చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement