India Open: సైనాపై మాల్విక సంచలన విజయం...  క్వార్ట‌ర్స్‌లో సింధు

India Open 2022: PV Sindhu Advances, Saina Nehwal Knocked Out - Sakshi

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ టోర్నీలో ఇవాళ భార‌త్‌కు మిశ్ర‌మ ఫ‌లితాలు వచ్చాయి. భారత స్టార్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు రెండో రౌండ్‌లో సునాయ‌స విజయం సాధించి క్వార్ట‌ర్స్‌లో అడుగుపెట్టగా.. మరో భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు భంగపాటు ఎదురైంది. రెండో రౌండ్‌లో సింధు.. ఐరా శర్మను 21-10, 21-10 తేడాతో సునాయ‌సంగా ఓడించగా, సైనా నెహ్వాల్.. ప్రపంచ 111వ ర్యాంకర్‌ మాల్విక బన్సోద్‌ చేతిలో 17-21, 9-21 తేడాతో ఓట‌మి పాలైంది. కాగా, ఇండియా ఓపెన్‌లో ఇవాళ క‌రోనా క‌ల‌క‌లం రేపిన సంగతి తెలిసిందే. కిదాంబి శ్రీకాంత్‌, అశ్విని పొన్నప్ప సహా ఏడుగురు భార‌త షట్లర్లు వైర‌స్ బారిన ప‌డినట్లు నిర్ధారణ అయ్యింది. 

సైనాపై మాల్విక సంచలన విజయం... 
టాప్‌ షట్లర్, ఒలింపిక్‌ పతక విజేత సైనా నెహ్వాల్‌కు ప్రిక్వార్టర్స్‌లో షాక్‌ ఎదురైంది. భారత్‌కే చెందిన మాల్విక బన్సోద్‌ 21–17, 21–9తో నాలుగో సీడ్‌ సైనాపై సంచలన విజయం సాధించింది. 34 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో వర్ధమాన షట్లర్‌ మాల్విక ప్రత్యర్థిపై చెలరేగిపోయింది. 2017నుంచి చూస్తే సైనా ఒక భారత ప్లేయర్‌ చేతిలో ఓడటం ఇదే రెండో సారి (మరో సారి సింధు చేతిలో) మాత్రమే.  సింధు 21–10, 21–10తో ఐరా శర్మ (భారత్‌)పై నెగ్గి సింధు క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించగా, కేయూర  10–21, 10–21తో ఆకర్షి కశ్యప్‌ చేతిలో ఓడిపోయింది.

పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్‌ హెచ్‌.ఎస్‌. ప్రణయ్‌ వాకోవర్‌తో, మూడో సీడ్‌ లక్ష్యసేన్‌ 21–12, 21–15తో ఫెలిక్స్‌ బురెస్టెండ్‌ (స్వీడెన్‌)పై గెలిచి క్వార్టర్స్‌ చేరారు. మహిళల డబుల్స్‌లో అశ్వినికి వైరస్‌ సోకడంతో భాగస్వామి సిక్కిరెడ్డికి, త్రిషాకు  కరోనాతో పుల్లెల గాయత్రికి నిరాశ తప్పలేదు. పురుషుల డబుల్స్‌లో రెండో సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ షెట్టి జోడీ 21–9, 21–18తో శ్యామ్‌ ప్రసాద్‌–సుంజీత్‌ జంటపై గెలిచి క్వార్టర్స్‌ చేరారు. 
చదవండి: ఈ కుర్రాడిని ఫీగా వదిలేయండి.. పంత్‌పై సెహ్వాగ్‌ ఆసక్తికర ట్వీట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top