Ind Vs Wi 3rd ODI: Shikhar Dhawan Should Be Back For 3rd ODI, Says Rohit Sharma - Sakshi
Sakshi News home page

Ind Vs Wi 3rd ODI: ప్రయోగాలకు సిద్ధం.. అతడు కచ్చితంగా తుది జట్టులో ఉంటాడు: రోహిత్‌ శర్మ

Feb 10 2022 11:17 AM | Updated on Feb 10 2022 3:07 PM

Ind Vs Wi 3rd ODI: Shikhar Dhawan Should Be Back Playing XI Says Rohit Sharma - Sakshi

Ind Vs Wi 3rd ODI: ప్రయోగాలకు సిద్ధం.. అతడు కచ్చితంగా తుది జట్టులో ఉంటాడు: రోహిత్‌ శర్మ

Ind Vs Wi ODI Series 2022- Rohit Sharma Comments: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌లో ఘోర పరాభవం ఎదుర్కొన్న టీమిండియా స్వదేశంలో మాత్రం అదరగొట్టింది. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తద్వారా స్వదేశంలో కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు మధుర జ్ఞాపకం మిగిలింది. హిట్‌మ్యాన్‌ సారథ్యంలో ఇప్పటికే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక వన్డే కెప్టెన్‌గానూ ఆడిన తొలి సిరీస్‌లోనే విజయం అందుకున్నాడు రోహిత్‌ శర్మ.

ఈ క్రమంలో బుధవారం విండీస్‌తో రెండో వన్డే ముగిసిన అనంతరం అతడు మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశాడు. సిరీస్‌ గెలవడం మంచి అనుభూతి ఇచ్చిందన్నాడు. కాగా తొలి వన్డేకు రెగ్యులర్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ దూరం కాగా... రోహిత్‌కు జోడీగా ఇషాన్‌ కిషన్‌ బరిలోకి దిగాడు. ఇక రెండో వన్డేకు రాహుల్‌ అందుబాటులోకి వచ్చినా... రిషభ్‌ పంత్‌ను ఓపెనర్‌గా పంపి ప్రయోగం చేశారు. అయితే, ఓపెనర్‌గా ఈ యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 34 బంతులు ఎదుర్కొని 18 పరుగులు మాత్రమే చేశాడు.

ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే సిరీస్‌ కైవసం చేసుకున్న క్రమంలో మూడో వన్డేలో శిఖర్‌ ధావన్‌ను జట్టులోకి తీసుకుంటామని పేర్కొన్నాడు. ‘‘తర్వాతి మ్యాచ్‌కు శిఖర్‌ తుది జట్టులోకి రావాల్సిందే. కొన్ని మ్యాచ్‌లు ఓడిపోయినా పర్వాలేదు కానీ... కొన్ని ప్రయోగాలు చేయక తప్పదు. సుదీర్ఘ కాలంలో జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతాం. 

జట్టు కూర్పు ఎలా ఉండాలన్న విషయం.. బెస్ట్‌ కాంబినేషన్‌ గురించి ఆలోచిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు. కాగా టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఇప్పటి వరకు 148 వన్డేలు ఆడాడు. 45.80 సగటుతో 6274 పరుగులు సాధించాడు. గత 9 మ్యాచ్‌లలో అతడు ఐదు అర్ధ శతకాలు సాధించడం గమనార్హం. ఇక రెండో వన్డేలో ప్రసిద్ధ్‌ కృష్ణ 4  వికెట్లు పడగొట్టి అద్భుతంగా రాణించడంతో టీమిండియా 44 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక అహ్మదాబాద్‌ వేదికగా ఫిబ్రవరి 11న మూడో వన్డే జరుగనుంది.

స్కోర్లు: ఇండియా- 237/9 (50 ఓవర్లు)
వెస్టిండీస్‌- 193 (46 ఓవర్లు)

చదవండి: IPL 2022 Auction: 8 కోట్లు.. అతడు ఇరగదీస్తున్నాడు.. 6 కోట్లు ఖర్చు చేశారు... ఈ ‘హిట్టర్‌’ మాత్రం.. ‘ముంబై’ తప్పుచేసిందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement