
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో (West Indies) జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా (Team India) మంచి స్కోర్ దిశగా సాగుతుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (36; 7 ఫోర్లు), సాయి సుదర్శన్ (7) ఔట్ కాగా.. కేఎల్ రాహుల్ (Kl Rahul) (53), శుభ్మన్ గిల్ (18) క్రీజ్లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ తీశారు. విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 41 పరుగులు వెనుకపడి ఉంది.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.
విండీస్ ఇన్నింగ్స్లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు.
మిగతా వారిలో జాన్ క్యాంప్బెల్ 8, తేజ్నరైన్ చంద్రపాల్ డకౌట్, జోమెల్ వార్రికన్ 8, జోహన్ లేన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్లో భారత వికెట్కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
చదవండి: రుతురాజ్, ఇషాన్ కిషన్ విఫలం.. పోరాడుతున్న రజత్ పాటిదార్