స్వదేశంలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో వెస్టిండీస్కు కంటితుడుపు విజయం దక్కింది. ఈ సిరీస్ను ఇదివరకే 0-2తో కోల్పోయిన విండీస్.. నిన్న (ఫిబ్రవరి 25) జరిగిన మూడో వన్డేలో గెలిచి పర్యాటక జట్టు ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది.
గ్రెనడా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో విండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించింది. తొలుత బౌలింగ్లో (10-2-33-2) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు కూడా తీసిన హేలీ.. ఆతర్వాత బ్యాటింగ్లో సెంచరీ చేసి తన జట్టును గెలిపించింది. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. హేలీ (10-2-33-2), కరిశ్మ (10-0-39-2), ఫ్లెచర్ (10-1-39-1), ఆశ్మిని (10-0-42-1) లంక ప్లేయర్లను కట్టడి చేశారు. లంక ఇన్నింగ్స్లో హర్షిత సమరవిక్రమ (70) అర్ద సెంచరీతో రాణించగా.. కవిష దిల్హరి (45 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్ చేసింది.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో విండీస్ తొలి 5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హేలీ.. స్టెఫానీ టేలర్ (38) సహకారంతో విండీస్ను విజయతీరాల వరకు చేర్చింది. చిన్నెల్ హెన్రీ (32 నాటౌట్), డియాండ్రా డాట్టిన్ (24) విండీస్ను విజయతీరాలు దాటించారు. 46 ఓవర్లలో విండీస్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో లంక బౌలర్లు మల్కి మదారా 2, రణవీర, కెప్టెన్ చమారీ చెరో వికెట్ తీశారు.


