
ఇరానీ కప్ 2025లో (Irani Cup 2025) రెస్ట్ ఆఫ్ ఇండియా (Rest Of India) ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు 124 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. స్టార్ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్ (9), ఇషాన్ కిషన్ (1) చేతులెత్తేశారు.
యువ సంచలనాలు యశ్ ధుల్ (11), ఆర్యన్ జుయల్ (23) కూడా నిరాశపరిచారు. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (52) మాత్రమే అర్ద సెంచరీతో రాణించాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ (42 నాటౌట్) పోరాడుతున్నాడు. అతనితో పాటు మానవ్ సుతార్ (1) క్రీజ్లో ఉన్నాడు.
విదర్భ బౌలర్లలో పార్థ్ రేఖడే 2, హర్ష్ దూబే, దర్శన్ నల్కండే, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెస్ట్ ఆఫ్ ఇండియా 53 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. విదర్భ (Vidarbha) తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఈ జట్టు ఇంకా 200 పరుగులు వెనుకపడి ఉంది.
అంతకుముందు విదర్భ తొలి ఇన్నింగ్స్లో 342 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ అథర్వ తైడే (143) సెంచరీతో కదంతొక్కగా.. యశ్ రాథోడ్ (91) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరు మినహా విదర్భ జట్టులో ఒక్కరు కూడా రాణించలేదు.
అమన్ మొఖడే 19, ధృవ్ షోరే 18, దనిశ్ మాలేవార్ డకౌట్, కెప్టెన్ అక్షయ్ వాద్కర్ 5, యశ్ ఠాకూర్ 11, హర్ష్ దూబే డకౌట్, దర్శన్ నల్కండే 20, ఆదిత్య ఠాకరే 2 పరుగులకు ఔటయ్యారు.
రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో మానవ్ సుతార్, ఆకాశ్దీప్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. సరాన్ష్ జైన్ 2, అన్షుల్ కంబోజ్, గుర్నూర్ బ్రార్ తలో వికెట్ తీశారు. కాగా, ఇరానీ ట్రోఫీ అనేది రంజీ ఛాంపియన్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య జరుగుతుంది.
చదవండి: IND vs WI 1st Test: పర్వాలేదనిపించిన జైస్వాల్.. నిరాశపరిచిన సాయి