Ind Vs SA: చెలరేగిన వాషీ, సిరాజ్‌, కుల్దీప్‌.. టీమిండియాదే సిరీస్‌! గిల్‌ బ్యాడ్‌లక్‌!

Ind Vs SA 3rd ODI: India Beat South Africa By 7 Wickets Won Series - Sakshi

South Africa tour of India, 2022 - India vs South Africa, 3rd ODI: సౌతాఫ్రికాతో నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా 2-1తో ధావన్‌ సేన ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇక అంతకు ముందు టీ20 సిరీస్‌ను సైతం రోహిత్‌ సారథ్యంలోని భారత జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో భారత పర్యటనకు వచ్చిన సఫారీలు ఈసారి ఒట్టి చేతులతోనే వెనుదిరిగినట్లయింది.

చెలరేగిన బౌలర్లు
టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు బౌలర్లు శుభారంభం అందించారు. మహ్మద్‌ సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ ప్రొటిస్‌ ఓపెనర్లు జానేమన్‌ మలన్‌(15), క్వింటన్‌ డికాక్‌(6) వికెట్లు పడగొట్టి ఆదిలోనే షాకిచ్చారు. 

అదే విధంగా షాబాజ్‌ అహ్మద్‌, కుల్దీప్‌ యాదవ్‌ సైతం స్పిన్‌ మాయాజాలంతో సౌతాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఈ నలుగురూ చెలరేగడంతో దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లకే చేతులెత్తేసింది. కేవలం 99 పరుగులు మాత్రమే చేయగలిగింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ 34 పరుగులతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

పాపం గిల్‌..
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. తొలుత రనౌట్‌ రూపంలో ఓపెనర్‌, కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ వికెట్‌ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌(10)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

అయితే, దురదృష్టవశాత్తూ లుంగీ ఎంగిడి బౌలింగ్‌లో 19వ ఓవర్‌ రెండో బంతికి గిల్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అప్పటికి అతడు సాధించిన పరుగులు 49. అర్ధ సెంచరీకి అడుగు దూరంలో నిలిచిపోయాడు. 

సిక్సర్‌తో లాంఛనం పూర్తి
ఇక సంజూ శాంసన్‌(2, నాటౌట్‌)తో కలిసి శ్రేయస్‌ అయ్యర్‌(28, నాటౌట్‌) లాంఛనం పూర్తి చేశాడు. సిక్సర్‌ బాది టీమిండియా విజయం ఖరారు చేశాడు. గిల్‌(57 బంతుల్లో 49 పరుగులు), శ్రేయస్‌ అయ్యర్‌(23 బంతుల్లో 28 పరుగులు) రాణించడంతో 19.1 ఓవర్లలోనే ధావన్‌ సేన లక్ష్యాన్ని ఛేదించింది. కుల్దీప్‌ యాదవ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా మూడో వన్డే మ్యాచ్‌ స్కోర్లు:
సౌతాఫ్రికా- 99 (27.1 ఓవర్లు)
భారత్‌- 105/3 (19.1 ఓవర్లు) 
ఏడు వికెట్ల తేడాతో టీమిండియా విజయం
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ధావన్‌ సేన కైవసం
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: కుల్దీప్‌ యాదవ్‌(4.1 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు)

చదవండి: హ్యూమా ఖురేషీతో కలిసి చిందేసిన టీమిండియా కెప్టెన్‌
Ind Vs SA: వన్డేల్లో సౌతాఫ్రికా సరికొత్త ‘రికార్డు’.. ధావన్‌ పరిస్థితి ఇదీ అంటూ వసీం జాఫర్‌ ట్రోల్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top