ICC World Cup Qualifiers: పాకిస్తాన్‌ గెలుపు బోణీ | ICC Women's World Cup Qualifier: Pakistan Beat Ireland By 38 Runs | Sakshi
Sakshi News home page

ICC World Cup Qualifiers: పాకిస్తాన్‌ గెలుపు బోణీ

Apr 10 2025 9:13 AM | Updated on Apr 10 2025 9:26 AM

ICC Women's World Cup Qualifier: Pakistan Beat Ireland By 38 Runs

ఐర్లాండ్‌పై 38 పరుగుల తేడాతో విజయం

స్కాట్లాండ్‌ చేతిలో వెస్టిండీస్‌ పరాజయం

మహిళల వరల్డ్‌కప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ  

లాహోర్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌ జట్టు శుభారంభం చేసింది. స్వదేశంలో జరుగుతున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ జట్టు 38 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. 

మొత్తం 6 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో టాప్‌–2లో నిలిచిన రెండు జట్లు ఈ ఏడాది ఆఖర్లో భారత్‌ వేదికగా జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించనున్నాయి. బుధవారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ 49 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. 

179 పరుగులకే
సిద్రా అమీన్‌ (112 బంతుల్లో 51; 3 ఫోర్లు), ఆలియా రియాజ్‌ (58 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకాలతో ఆకట్టుకోగా... మునీబా అలీ (32) రాణించింది. ఐర్లాండ్‌ బౌలర్లలో జానె మగుర్‌ 3 వికెట్లు పడగొట్టగా... కెల్లి, కారా ముర్రె చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఐర్లాండ్‌ మహిళల జట్టు తడబడింది. 44 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటై పరాజయం ముటగట్టుకుంది. 

కెప్టెన్‌ గాబీ లూయిస్‌ (67 బంతుల్లో 44; 5 ఫోర్లు), అమీ హంటర్‌ (54 బంతుల్లో 44; 4 ఫోర్లు), ఒర్లా ప్రెండెర్‌గాస్ట్‌ (37) పోరాడినా ఫలితం లేకపోయింది. పాకిస్తాన్‌ బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డయానా బేగ్‌ 4, నష్రా సంధు 3 వికెట్లు పడగొట్టారు. తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం స్కాట్లాండ్‌తో పాకిస్తాన్‌ జట్టు తలపడుతుంది.  

హీలీ మాథ్యూస్‌ సెంచరీ వృథా... 
మరో మ్యాచ్‌లో కెప్టెన్‌ హీలీ మాథ్యూస్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టినా... వెస్టిండీస్‌ జట్టుకు పరాజయం తప్పలేదు. బుధవారం జరిగిన పోరులో విండీస్‌ 11 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌ చేతిలో ఓడింది. మొదట స్కాట్లాండ్‌ 45 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. 

సారా బ్రైస్‌ (56 బంతుల్లో 55; 6 ఫోర్లు), మేగన్‌ మెక్‌కాల్‌ (45; 5 ఫోర్లు) రాణించారు. విండీస్‌ బౌలర్లలో హీలీ మాథ్యూస్‌ 4 వికెట్లు పడగొట్టగా... అలీనె, కరిష్మా చెరో 2 వికెట్లు తీశారు. 

అనంతరం ఛేదనలో వెస్టిండీస్‌ 46.2 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ హీలీ మాథ్యూస్‌ (113 బంతుల్లో 114 నాటౌట్‌; 14 ఫోర్లు) ఓపెనర్‌గా బరిలోకి దిగి అజేయంగా నిలిచినా... మరో ఎండ్‌ నుంచి ఆమెకు సరైన సహకారం లభించలేదు. 

జైదా జేమ్స్‌ (45; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించింది. వరుస విరామాల్లో వికెట్లు పడుతున్నా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మాథ్యూస్‌ మొండిగా పోరాడింది. స్కాట్లాండ్‌ బౌలర్లలో క్యాథరిన్‌ 3 వికెట్లు తీసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement