టీమిండియాను శిక్షించిన ఐసీసీ | ICC Punishes India Women Cricket Team For Major Mistake Vs SLW In Tri Nation Series, More Details Inside | Sakshi
Sakshi News home page

టీమిండియాను శిక్షించిన ఐసీసీ

Apr 30 2025 10:46 AM | Updated on Apr 30 2025 12:55 PM

ICC Punishes India Women Cricket Team For Major Mistake Vs SLW In Tri Nation Series

శ్రీలంకలో జరుగుతున్న మహిళల ట్రై నేషన్ సిరీస్‌లో కోడ్‌ ఉల్లంఘించినందుకు గానూ ఐసీసీ టీమిండియాను శిక్షించింది. ఈ టోర్నీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లు నిర్దేశిత సమయంలో తమ కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోయారు. ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌లో ఆర్టికల్‌ 2.22 ఉల్లంఘన కిందికి ఇది వస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు నిర్దేశిత సమయం పూర్తయ్యే సరికి ఓ ఓవర్‌ వెనుక పడ్డారు. 

ఐసీసీ నియమాల ప్రకారం స్లో ఓవర్‌ రేట్‌లో ప్రతి ఓవర్‌కు ప్లేయర్ల మ్యాచ్‌ ఫీజ్‌లో 5 శాతం కోత విధిస్తారు. మ్యాచ్‌లో పాల్గొన్న సభ్యులందరికీ ఈ కోత వర్తిస్తుంది. ఐసీసీ విధించిన ఈ జరిమానాను టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఒప్పుకోవడంతో ఎలాంటి విచారణ జరగలేదు.

వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో భారత్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంకను భారత బౌలర్లు 147 పరుగులకే ఆలౌట్‌ (38.1 ఓవర్లలో) చేశారు. భారత బౌలర్లలో స్నేహ్‌ రాణా 3, నల్లపురెడ్డి చరణి, దీప్తి శర్మ తలో 2, అరుంధతి రెడ్డి ఓ వికెట్‌ పడగొట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో హాసిని పెరీరా (30) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌.. 29.4 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మ్యాచ్‌లో కూడా ప్రతిక రావల్‌ (50 నాటౌట్‌) అర్ద సెంచరీతో రాణించింది. స్మృతి మంధన 43, హర్లీన్ డియోల్‌ 48 (నాటౌట్‌) పరుగులతో సత్తా చాటారు.

ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాపై విజయం
ఈ టోర్నీలో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 29) జరిగిన ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాపై భారత్‌ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల న‌ష్టానికి 276 ప‌రుగులు చేసింది.

ఓపెనర్‌ ప్రతిక రావల్‌ (78) అర్ద సెంచరీతో.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (41), జెమీమా రోడ్రిగెజ్‌ (41), స్మృతి మంధన (36), హర్లీన్‌ డియోల్‌ (29), రిచా ఘోష్‌ (24) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.

భారత ఇన్నింగ్స్‌లో దీప్తి శర్మ (9) ఒక్కరే సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కు ఔట్‌ కాగా.. కశ్వీ గౌతమ్‌ 5 పరుగులతో అజేయంగా నిలిచింది. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, ఖాకాచ, క్లాస్‌, డి క్లెర్క్‌, డెర్క్‌సెన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 277 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికా.. 49. 2 ఓవ‌ర్ల‌లో 261 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఓ ద‌శ‌లో సునాయాసంగా గెలిచేలా క‌నిపించిన సౌతాఫ్రికాను భార‌త స్పిన్న‌ర్ స్నేహ్ రాణా దెబ్బ‌తీసింది. 48వ ఓవ‌ర్‌లో మూడు కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.

రాణా ఓవ‌రాల్‌గా త‌న 10 ఓవ‌ర్ల కోటాలో 43 ప‌రుగులిచ్చి 5 వికెట్లు సాధించింది. ద‌క్షిణాఫ్రికా 11 ప‌రుగుల వ్య‌వ‌ధిలో ఐదు వికెట్లు కోల్పోయింది. అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు స్నేహ్‌ రాణాకు ప్లేయర్ ఆఫ్‌ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

సౌతాఫ్రికా బ్యాట‌ర్ల‌లో టాజ్మిన్ బ్రిట్స్ (107 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 109) విరోచిత శ‌త‌కంతో చెల‌రేగింది. ఆమెతో పాటు లారా వోల్వార్డ్ట్(43), అన్నేరీ డెర్క్సెన్(30) రాణించిన‌ప్ప‌టికి.. వ‌రుస క్ర‌మంలో వికెట్లు కోల్పోవ‌డంతో ప్రోటీస్‌ ఓట‌మి చ‌విచూడాల్సి వ‌చ్చింది.

కాగా, ఈ ట్రై నేషన్‌ సిరీస్‌లో భారత్‌, సౌతాఫ్రికా, శ్రీలంకు జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో భారత్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో భారత్‌.. సౌతాఫ్రికా, శ్రీలంకతో మరో మ్యాచ్‌ ఆడుతుంది. అన్ని మ్యాచ్‌ల తర్వాత మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు మే 11న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ప్రస్తుతం భారత్‌ టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement