
టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma). అతడి సారథ్యంలో 2024లో టీ20 ప్రపంచకప్ (T20 World Cup) గెలిచిన భారత్.. యాభై ఓవర్ల ఫార్మాట్లో ఈ ఏడాది చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)ని కూడా కైవసం చేసుకుంది. ఇక పొట్టి వరల్డ్కప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్.. ఇటీవలే టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.
ప్రస్తుతం భారత వన్డే జట్టు కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్ శర్మ.. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్ నాటి జ్ఞాపకాలను తాజాగా గుర్తు చేసుకున్నాడు. ఒక దశలో తాను భయంతో వణికిపోయానని.. అయితే, తమ జట్టు మీద తనకున్న నమ్మకం వమ్ముకాలేదని పేర్కొన్నాడు. అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ మ్యాచ్ను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకువచ్చిందని తెలిపాడు.
ఆదుకున్న కోహ్లి, అక్షర్, దూబే
కాగా బార్బడోస్ వేదికగా గతేడాది జూన్లో జరిగిన వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాతో తలపడింది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా... ఓపెనర్ రోహిత్ శర్మ 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. వన్డౌన్లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ డకౌట్ కాగా.. పవర్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ 3 పరుగులకే అవుటయ్యాడు.
ఈ క్రమంలో దూకుడుగా మొదలుపెట్టి 1.3 ఓవర్లలోనే 23 పరుగులు సాధించిన టీమిండియా.. ఐదో ఓవర్ పూర్తయ్యేసరికి 34 పరుగులు మాత్రమే చేసి మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఇలాంటి దశలో మరో ఓపెనర్ విరాట్ కోహ్లి (76), ఐదు, ఆరు స్థానాల్లో వచ్చిన అక్షర్ పటేల్ (47), శివం దూబే (27) జట్టును ఆదుకున్నారు.
ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి టీమిండియా 176 పరుగులు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులే చేయగలిగింది. దీంతో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి టీమిండియా పదమూడేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది.
భయంతో వణికిపోయాను.. ఏమీ తోచలేదు
ఈ విషయాలను గుర్తు చేసుకున్న రోహిత్ శర్మ.. ‘‘నిజం చెప్పాలంటే నేను వణికిపోయాను. నాకసలు ఏమీ తోచలేదు. ఫలితం విషయంలో ప్రత్యర్థికి అవకాశం ఇచ్చామా అనిపించింది.
అయితే, నా మనసులో మాత్రం మా లోయర్ ఆర్డర్ మీద పూర్తి నమ్మకం ఉంది. ఆ టోర్నీ మొత్తంలో వారికి ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రానప్పటికీ.. ఈసారి కచ్చితంగా ప్రభావం చూపుతారని నమ్మాను.
అతడే గేమ్ ఛేంజర్
నిజానికి చాలా మందికి అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ గురించి గుర్తుండకపోవచ్చు. అయితే, అతడే గేమ్ ఛేంజర్. క్లిష్ట పరిస్థితుల్లో 31 బంతుల్లో 47 పరుగులు చేయడం గొప్ప విషయం.
ఇక విరాట్ గురించి చెప్పేదేముంది. తను అద్భుత బ్యాటింగ్తో మరోసారి ఆకట్టుకున్నాడు’’ అని పేర్కొన్నాడు. జియోహాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఫైనల్లో విరాట్ కోహ్లి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా... భారత ప్రధాన పేసర్ ‘జస్ప్రీత్ బుమ్రా’ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.
చదవండి: విధ్వంసకర శతకం, మూడు ఫిఫ్టీలు.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్