నేపాల్‌తో భారత్‌ తొలి పోరు | First Kho Kho World Cup schedule released | Sakshi
Sakshi News home page

నేపాల్‌తో భారత్‌ తొలి పోరు

Jan 8 2025 4:07 AM | Updated on Jan 8 2025 4:07 AM

First Kho Kho World Cup schedule released

మొదటి ఖోఖో ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల

పురుషుల, మహిళల విభాగంలో మొత్తం 39 జట్లు పోటీ

ఈ నెల 13 నుంచి 19 వరకుఢిల్లీ వేదికగా టోర్నమెంట్‌  

న్యూఢిల్లీ: భారత్‌ వేదికగా జరగనున్న తొలి ఖోఖో ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 13 నుంచి 19 వరకు న్యూఢిల్లీ వేదికగా జరగునున్న వరల్డ్‌కప్‌ తొలి పోరులో సోమవారం నేపాల్‌తో భారత్‌ తలపడుతుంది. ఈ మేరకు అఖిల భారత ఖోఖో సమాఖ్య మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ ప్రపంచకప్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. రెండు విభాగాల్లో కలిపి మొత్తం 39 జట్లు టోర్నీలో పాల్గొననున్నాయి.

పురుషుల విభాగంలో 20 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించారు. తొలి నాలుగు రోజులు లీగ్‌ మ్యాచ్‌లు జరగనుండగా... ఈ నెల 17 నుంచి ప్లే ఆఫ్స్‌ దశ ప్రారంభం కానుంది. 19న తుదిపోరు నిర్వహించనున్నారు. గ్రూప్‌ ‘ఎ’లో నేపాల్, పెరూ, బ్రెజిల్, భూటాన్‌తో కలిసి భారత్‌ పోటీ పడుతోంది. మహిళల విభాగంలో 19 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించారు. 

ఇరాన్, మలేసియా, దక్షిణ కొరియాతో కలిసి భారత మహిళల జట్టు గ్రూప్‌ ‘ఎ’ బరిలోకి దిగనుంది. మహిళల విభాగంలో ఈ నెల 14న దక్షిణ కొరియాతో భారత జట్టు తొలి మ్యాచ్‌ ఆడుతుంది. లీగ్‌ దశలో ఒక్కో గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లతో పాటు నాలుగు గ్రూప్‌ల్లో కలిపి మూడో స్థానంలో నిలిచిన రెండు అత్యుత్తమ జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించనున్నాయి. అందులో గెలిచిన జట్లు సెమీస్‌కు చేరతాయి.

Advertisement
 
Advertisement
Advertisement