
PC: Daily Mail
వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్ను ఇంగ్లండ్ విజయంతో ఆరంభించింది. గురువారం ఎడ్జ్బాస్టన్ వేదికగా తొలి వన్డేలో 238 పరుగుల తేడాతో వెస్టిండీస్ను ఇంగ్లండ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 400 పరుగులు చేసింది.
బెన్ డకెట్(60), జోరూట్(57), హ్యారీ బ్రూక్(58), జాకోబ్ బెతెల్(82) హాఫ్ సెంచరీలతో రాణించగా.. జేమీ స్మిత్(37), విల్ జాక్స్(39) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. విండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్ నాలుగు వికెట్లు సాధించగా.. అల్జారీ జోసెఫ్, జస్టిన్ గ్రీవ్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో కరేబియన్ జట్టు కేవలం 162 పరుగులకే కుప్పకూలింది.
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్..
ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఒక్క ప్లేయర్ కూడా సెంచరీ చేయకుండా వన్డేల్లో అత్యధిక స్కోరును నమోదు చేసిన తొలి జట్టుగా ఇంగ్లండ్ రికార్డులకెక్కింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఏ ఒక్క బ్యాటర్ సెంచరీ చేయనప్పటికి.. టీమ్ స్కోర్ మాత్రం 400 పరుగుల మార్క్ను అందుకుంది.
ఇప్పటివరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా పేరిట ఉండేది. 2007లో పాకిస్తాన్తో జరిగిన వన్డే మ్యాచ్లో ఏ ఒక్క ప్లేయర్ కూడా సెంచరీ చేయకుండా సౌతాఫ్రికా 392 పరుగులు చేసింది. తాజా మ్యాచ్తో సఫారీల ఆల్టైమ్ రికార్డును ఇంగ్లీష్ జట్టు బ్రేక్ చేసింది. అదేవిధంగా వన్డే క్రికెట్ చరిత్రలోనే ఒకే ఇన్నింగ్స్లో ఏడుగురు బ్యాటర్లు 30 ప్లస్ రన్స్ చేయడం కూడా ఇదే తొలిసారి.
చదవండి: నేను సాకులు చెప్పను.. యుద్దం ఇంకా ముగియలేదు: శ్రేయస్ అయ్యర్