ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సంప్రదాయ టెస్టు క్రికెట్కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయంతో శుభారంభం చేసినప్పటికీ, మ్యాచ్ రెండున్నర రోజుల్లోనే ముగిసిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన స్టోక్స్ టెస్టు క్రికెట్ చచ్చిపోయే స్థితిలో ఉందంటూ పేర్కొన్నాడు.
బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టోక్స్ మాట్లాడుతూ.. ‘లార్డ్స్ టెస్టులో మేము న్యూజిలాండ్ను 115 పరుగుల తేడాతో ఓడించినప్పటికీ నేను సంతోషంగా లేను. లార్డ్స్ పిచ్ టెస్టు క్రికెట్కు ఉత్తమమైనది కాదనేది నా అభిప్రాయం. ఐదు రోజుల పాటు జరగాల్సిన టెస్టు మ్యాచ్ రెండున్నర రోజుల్లోనే మ్యాచ్ ముగిసిపోవడమనేది ఆశ్యర్యం కలిగించింది.
టెస్టు క్రికెట్ను అమితంగా ఇష్టపడే నాలాంటి వ్యక్తి .. ఇలాంటి వాటివల్ల మేలు జరుగుతుందా అన్నది ఆలోచించాల్సిన విషయం. అయితే దీనికి గ్రౌండ్ నిర్వాహకులను తప్పుబట్టలేం. పిచ్ క్యురేటర్ కానీ, గ్రౌండ్స్మన్ కానీ ఒక అంచనాతోనే పిచ్ను రూపొందిస్తుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మ్యాచ్లు రెండు లేదా మూడు రోజుల్లో ముగిసిపోతే టెస్టు క్రికెట్ మనుగడకు ప్రమాదం పొంచి ఉంటుంది.
2025-26 యాషెస్ సిరీస్లోనూ మాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆనాడు ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టులు రెండు రోజుల్లోనే ముగిశాయి. ఆసీస్లో ఇలా జరగడంపై అప్పుడు కూడా ఆందోళన వ్యక్తం చేశాను. తాజాగా మా సొంతగడ్డపై కూడా ఒక టెస్టు మ్యాచ్ రెండున్నర రోజుల్లోనే ముగిసిపోవడంతో ప్రశ్నలన్నీ నావైపు తిరిగాయి. టెస్టు క్రికెట్ అనేది నా దృష్టిలో ఎన్నటికీ అత్యుత్తమ ఫార్మాట్. అది ఎప్పటికీ కనుమరుగవకూడదని బలంగా నమ్ముతాను.’ అని చెప్పుకొచ్చాడు.
అయితే స్టోక్స్ వ్యాఖ్యలను క్రికెట్ అభిమానులు తీవ్రంగా తప్పుబట్టారు. ‘సంప్రదాయ టెస్టు క్రికెట్కు బజ్బాల్ ఆటను పరిచయం చేసిందే మీరు.. ఐదురోజులు సాగాల్సిన మ్యాచ్లను బజ్బాల్ ఆటతో రెండు లేదా మూడు రోజుల్లో ముగించే మహత్తర కార్యక్రమానికి ఆద్యులు మీరేగా’ అంటూ కామెంట్లు చేశారు.
ఇక న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి టెస్టు కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసింది. కివీస్పై 115 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయాన్ని అందుకుంది. ఓలీ రాబిన్సన్ రెండు ఇన్నింగ్స్లు కలిపి ఏడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మరో విశేషమేమిటంటే ఈ మ్యాచ్లో అన్ని వికెట్లు పేస్ బౌలర్లే పడగొట్టడం విశేషం. ఇక రెండో టెస్టు జూన్ 17 నుంచి ఓవల్ వేదికగా జరగనుంది.


