భారత మహిళల హాకీ జట్టుతో పని చేస్తున్న నెదర్లాండ్స్ దిగ్గజం
న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టును మరింత పటిష్టంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో హెడ్ కోచ్ జోయెర్డ్ మరీన్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఇందు కోసం భారత జట్టుతో కలిసి పని చేసేందుకు నెదర్లాండ్స్కు చెందిన దిగ్గజ ఆటగాడు, డ్రాగ్ ఫ్లిక్ స్పెషలిస్ట్ టెకె టెకెమాను హెడ్ కోచ్ తన బృందంలోకి తీసుకున్నాడు. 242 మ్యాచ్లలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన టెకెమా 221 గోల్స్ సాధించాడు.
2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో రజతం గెలిచిన జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు. ఇటీవల ముగిసిన ఆ్రస్టేలియా సిరీస్తో పాటు జూన్ 15 నుంచి జరిగే నేషన్స్ కప్ టోర్నీ కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ శిబిరంలో టెకెమా పాల్గొంటున్నాడు. ఈ క్యాంప్లో భారత డ్రాగ్ఫ్లికర్లు దీపిక, లాల్తంత్లువాంగి, అన్నులకు టెకెమా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాడు.
‘ఆధునిక హాకీలో పెనాల్టీ కార్నర్ల ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెనాల్టీ అవకాశాలను ఎట్టి పరిస్థితిల్లో ఆటగాళ్లు కోల్పోరాదు. ఈ విషయంలో టెకెమా అపార అనుభవం, అతను ఇచ్చే శిక్షణ మన జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది. టెకెమాకు నేను కూడా కోచ్గా వ్యవహరించాను కాబట్టి అతని గురించి నాకు బాగా తెలుసు. అందుకే అతడిని ఎంచుకున్నా’ అని మరీన్ వెల్లడించాడు.


