
ఐపీఎల్-2025 సీజన్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడే జట్టు ఏదో తేలిపోయింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్.. తుది పోరుకు ఆర్హత సాధించింది.
మంగళవారం(జూన్ 3)న జరగనున్న ఫైనల్లో ఆర్సీబీ, పంజాబ్ తొలి టైటిల్ కోసం అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. గెలుపు జోష్లో ఉన్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు భారీ షాక్ తగిలింది. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో స్లో ఓవర్ రేటు మెయింటిన్ చేసినందుకుగానూ అయ్యర్కు బీసీసీఐ జరిమానా విధించింది.
ఈ ఏడాది సీజన్లో పంజాబ్ స్లో ఓవర్ రేట్ను నమోదు చేయడం ఇది రెండోసారి. దీంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం అయ్యర్కు రూ.24 లక్షల ఫైన్ విధించారు. "శ్రేయస్ అయ్యర్కు జరిమానా విధించాం. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ను కొనసాగించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇది రెండో సారి అయినందున ఆర్టికల్ 2.22 ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం శ్రేయస్కు రూ. 24 లక్షలు ఫైన్ వేశాము.
మిగిలిన సభ్యులకు ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం, ఇందులో ఏది తక్కువైతే అది జరిమానా విధించడం జరిగింది’ అని ఐపీఎల్ అధికారులు వెల్లడించారు. కాగా ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయ్యర్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 87 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా 204 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 19 ఓవర్లలోనే చేధించింది.
చదవండి: అతడొక అత్యద్భుతం.. మేము అనుకున్నది జరగలేదు: హార్దిక్