పోరాడి ఓడిన టీమిండియా..

Australia Wins Odi Series Against Team India - Sakshi

సిడ్నీ: ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలోనూ పరాజయం చెందిన టీమిండియా సిరీస్‌ను కోల్పోయింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేను గెలిచిన ఆసీస్‌.. రెండో వన్డేలో కూడా విజయం సాధించింది. ఆసీస్‌ 51 పరుగుల తేడాతో గెలిచింది. ఫలితంగా సిరీస్‌ను ఇంకా మ్యాచ్‌ ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది.  వార్నర్‌(83; 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫించ్‌(60; 69 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ ‌), స్టీవ్‌ స్మిత్‌(104; 64 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), లబూషేన్‌(70; 61 బంతుల్లో 5 ఫోర్లు), మ్యాక్స్‌వెల్‌( 63; 29 బంతుల్లో 4 ఫోర్లు, 4సిక్సర్లు)లు రాణించడంతో ఆసీస్‌ రికార్డు స్కోరు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌కు శుభారంభం లభించింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను వార్నర్‌-ఫించ్‌లు దాటిగా ఆరంభించారు.  ఈ జోడి తొలి వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో ఆసీస్‌కు తిరుగులేకుండా పోయింది. తరువాత వచ్చిన బ్యాట్స్‌మన్‌ ఫ్రీగా బ్యాటింగ్‌ చేసి పరుగులు వరద పారించారు.  (ఏడేళ్ల తర్వాత మళ్లీ రికార్డు బ్యాటింగ్‌)

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 338 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. టీమిండియా తమ పోరాటాన్ని కడవరకూ సాగించిన భారీ లక్ష్యం కావడంతో ఓటమి తప్పలేదు. టీమిండియా ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌(30; 23 బంతుల్లో 5 ఫోర్లు),  మయాంక్‌ అగర్వాల్‌(28; 26 బంతుల్లో 4 ఫోర్లు)లు 9 ఓవర్లలోపే ఔటయ్యారు. ఆ తరుణంలో విరాట్‌ కోహ్లి(89 ; 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌(38; 36 బంతుల్లో 5 ఫోర్లు)లు మరమ్మత్తులు చేశారు.  ఈ జోడి మూడో వికెట్‌కు 93 పరుగులు జత చేసిన తర్వాత అయ్యర్‌ పెవిలియన్‌ చేరాడు. హెన్రిక్యూస్‌ బౌలింగ్‌లో స్టీవ్‌ స్మిత్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో అయ్యర్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.  

అనంతరం కోహ్లి-కేఎల్‌ రాహుల్‌లు ధాటిగా బ్యాటింగ్‌ చేశారు. ప్రధానంగా రాహుల్‌ ఫోర్లు, సిక్స్‌లతో ఆకట్టుకున్నాడు. కాగా, ఈ జంటం 72 పరుగులు జత చేసిన తర్వాత కోహ్లి నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. హజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో హెన్రిక్యూస్‌ ఒక మెరుపు క్యాచ్‌ అందుకోవడంతో కోహ్లి పెవిలియన్‌ చేరాడు. ఆపై హార్దిక్‌ పాండ్యాతో కలిసి రాహుల్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ 63 పరుగులు జోడించిన తర్వాత రాహుల్‌(76; 66 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఐదో వికెట్‌గా ఔటైన తర్వాత టీమిండియా స్వల్ప  విరామాల్లో వికెట్లు కోల్పోయింది. జడేజా(24; 11 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్యా(28; 31 బంతుల్లో 1  ఫోర్‌, 1 సిక్స్‌)లు మోస్తరుగా ఆడారు. నిర్ణీత ఓవర్లలో భారత్‌ 9 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసి ఓటమి పాలైంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top