ఫిబ్రవరి 28, 2026.. భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. జమ్మూ అండ్ కాశ్మీర్ తమ 67 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరిదించుతూ తొలి రంజీ ట్రోఫీ టైటిల్ను సొంతం చేసుకుంది. హుబ్లీ వేదికగా జరిగిన జరిగిన రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్లో కర్ణాటకను ఓడించి జమ్మూ కశ్మీర్ ఛాంపియన్గా అవతరించింది. ఈ చారిత్రత్మక విజయంలో ఆ జట్టు పేసర్ ఆకిబ్ నబీ ధార్ది కీలక పాత్ర. ఈ సీజన్ అసాంతం ఆకిబ్ నబీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
ఈ సీజన్లో మొత్తం 60 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒక పేసర్ 60 వికెట్ల మార్కును అందుకోవడం ఇది కేవలం మూడవసారి మాత్రమే. ఫైనల్ మ్యాచ్లో కూడా ఆకిబ్ దుమ్ములేపాడు. 29 ఏళ్ల నబీ తన స్వింగ్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.
మొత్తంగా 5 వికెట్లు పడగొట్టి కర్ణాటక ఓటమిని శాసించాడు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్ వంటి స్టార్ బ్యాటర్లను సైతం నబీ బోల్తా కొట్టించాడు. నబీ తన సంచలన ప్రదర్శనలతో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని సైతం ఆకర్షించాడు.
రాబోయే ఇంగ్లండ్ పర్యటనకు ఆకిబ్ నబీని ఎంపిక చేయాలని గంగూలీ సెలెక్టర్లకు సూచించాడు. ఇంగ్లండ్ పిచ్లపై ఆకిబ్ స్వింగ్ బౌలింగ్ భారత్కు ఉపయోగపడుతుందని గంగూలీ అభిప్రాయపడ్డాడు.
"ప్రయత్నం, దృడ సంకల్పం ఉంటే ఏం చేయగలరో జమ్మూ కశ్మీర్ ప్రపంచానికి చాటి చెప్పింది. జమ్మూ కశ్మీర్ చారిత్రత్మక విజయంతో ఆ ప్రాంతం మొత్తం గర్వించేలా చేశారు. కఠిన పరిస్థితులే ఛాంపియన్లను తాయారు చేస్తాయి. ఆకిబ్ నబీ నిజంగా ఒక అద్భుతం.
నబీ ఇప్పుడు టీమిండియా జెర్సీ ధరించేందుకు సమయం అసన్నమైంది. ఈ ఏడాది వేసవిలో ఇంగ్లండ్తో జరిగే వైట్బాల్ సిరీస్కు నబీని ఎంపిక చేస్తే బాగుంటుంది" అని ఎక్స్లో దాదా రాసుకొచ్చాడు. కాగా బారముల్లాకు చెందిన నబీ.. ఐపీఎల్లో కూడా సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. గత డిసెంబర్లో జరిగిన వేలంలో రూ. 8.4 కోట్ల భారీ ధరకు ఆకిబ్ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.


