source: X
ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్లో శ్రీలంక జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. ఇవాళ జరిగిన తొలి సెమీస్లో పాకిస్తాన్ను 8 వికెట్ల తేడాతో చిత్త చేసి, తుది బెర్త్ దక్కించుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అయేషా జాఫర్ (71), షవాల్ జుల్ఫికర్ (54) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.
మిగతా ప్లేయర్లలో గుల్ ఫెరోజా డకౌట్ కాగా.. సైరా జబీన్ 17, కెప్టెన్ ఫాతిమా సనా 20 (నాటౌట్), ఎయ్మాన్ ఫాతిమా 5 (నాటౌట్) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో కావ్యా కవిండి, కెప్టెన్ చమారీ ఆటపట్టు, సుగంధిక కుమారి తలో వికెట్ తీశారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాటర్లు రెచ్చిపోయారు. చమారీ ఆటపట్టు (50 బంతుల్లో 83 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఆమెకు హాసిని పెరీరా (42), ఇమేషా దులానీ (27), హర్షిత సమరవిక్రమ (20 నాటౌట్) సహకరించారు. పాక్ బౌలర్లలో ఫాతిమా సనా, నష్రా సంధుకు తలో వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్లో ఓడినా, పాక్ జట్టు బ్రాంజ్ మెడల్ మ్యాచ్కు అర్హత సాధించింది. ఇవాళే భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్లో ఓడిన జట్టుతో పాక్ సెప్టెంబర్ 22న బ్రాంజ్ మెడల్ మ్యాచ్ ఆడుతుంది. భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ విజేత సెప్టెంబర్ 22నే జరిగే ఫైనల్లో శ్రీలంకను ఢీకొంటుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు స్వర్ణ పతకం సాధిస్తుంది. ఓడిన జట్టు రజతంతో సరిపెట్టుకుంటుంది.
ఇదీ చదవండి: మరో ముగ్గురికి టీమిండియా నుంచి పిలుపు


