టీమిండియా జపాన్ పర్యటన కోసం మరో ముగ్గురికి పిలుపు వచ్చింది. జపాన్తో జరగనున్న టీ20 మ్యాచ్, అలాగే ఏషియన్ గేమ్స్లో పాల్గొనేందుకు జపాన్ వెళ్లనున్న భారత క్రికెట్ జట్టుకు ముగ్గురు యువ బౌలర్లు నెట్ బౌలర్లుగా ఎంపికయ్యారు. జమ్మూ కశ్మీర్కు చెందిన రసిఖ్ సలామ్ దార్, మహారాష్ట్రకు చెందిన విక్కీ ఓస్త్వాల్, ఉత్తరప్రదేశ్కు చెందిన కార్తిక్ త్యాగిలను జాతీయ సెలెక్టర్లు ఎంపిక చేశారు.
ఈ ముగ్గురిని శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టుతో అనధికారిక సభ్యులుగా జత చేశారు. వీరు ప్రాక్టీస్ సెషన్లలో జట్టు సభ్యులకు బౌలింగ్ చేస్తారు. నిన్న (సెప్టెంబర్ 19) రాత్రే వీరు న్యూఢిల్లీ నుంచి టోక్యోకు బయల్దేరారు.
సెప్టెంబర్ 21న ప్రాక్టీస్.. 22న జపాన్తో మ్యాచ్
భారత జట్టు సెప్టెంబర్ 21న సానో ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేయనుంది. అనంతరం సెప్టెంబర్ 22న జపాన్తో టీ20 మ్యాచ్ ఆడుతుంది. ఆ మ్యాచ్ తర్వాత కూడా టీమిండియా మరికొన్ని రోజులు సానోలోనే ఉండి సాధన చేయనుంది. ఈ సమయంలో ముగ్గురు నెట్ బౌలర్లు జట్టుకు ఉపయోగపడనున్నారు.
ఆ తర్వాత భారత జట్టు నాగోయాకు వెళ్లి ఆసియా గేమ్స్లో పాల్గొంటుంది. ఈ మెగా ఈవెంట్లో భారత్ తొలి మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది.
నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో అదనపు బౌలర్లు
ఏషియన్ గేమ్స్ కోసం తొలుత ఎంపిక చేసిన భారత జట్టులో 15 మంది ఉండగా, నితీశ్ కుమార్ రెడ్డిని వెస్టిండీస్తో జరిగే స్వదేశీ వన్డే సిరీస్ కోసం టీమిండియాలోకి తీసుకున్నారు. దీంతో ఏషియన్ గేమ్స్ జట్టులో సభ్యుల సంఖ్య 14కు తగ్గింది. ఈ నేపథ్యంలో నెట్ ప్రాక్టీస్ కోసం ముగ్గురు అదనపు బౌలర్లను జట్టుతో కలిపారు.
సెప్టెంబర్ 23న రిపోర్టింగ్
మరోవైపు, వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టును సెప్టెంబర్ 23న తిరువనంతపురంలో రిపోర్ట్ చేయాలని బీసీసీఐ ఆదేశించింది. ఈ సిరీస్లోని తొలి వన్డే సెప్టెంబర్ 27న తిరువనంతపురంలోనే జరగనుండగా, రెండో వన్డే సెప్టెంబర్ 30న గువాహటిలో, మూడో వన్డే అక్టోబర్ 3న న్యూ చండీగఢ్లో జరగనున్నాయి. అనంతరం అక్టోబర్ 6 నుంచి లక్నో వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి: బీసీసీఐ కీలక నిర్ణయం.. 31 ఏళ్ల తర్వాత స్పెషల్ మ్యాచ్?


