టీమిండియాతో సిరీస్‌కు వెస్టిండీస్‌ జట్ల ప్రకటన | West Indies Squads For India ODIs, T20Is Announced | Sakshi
Sakshi News home page

టీమిండియాతో సిరీస్‌కు వెస్టిండీస్‌ జట్ల ప్రకటన

Sep 20 2026 7:43 AM | Updated on Sep 20 2026 7:56 AM

West Indies Squads For India ODIs, T20Is Announced

source: X

త్వరలో భారత్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల కోసం వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్లను నిన్న ప్రకటించారు. రెండు జట్లకు కెప్టెన్‌గా షాయ్‌ హోప్‌ను ఎంపిక చేశారు.

విధ్వంసకర బ్యాటర్‌ షిమ్రోన్‌ హెట్‌మైర్‌ వన్డేలకు దూరం​ కాగా.. టీ20 జట్టుకు అందుబాటులో ఉన్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2026 తర్వాత రిఫ్రెష్‌ అయ్యేందుకు అతడికి విశ్రాంతి ఇచ్చారు. దీంతో నేరుగా టీ20 సిరీస్‌లో జట్టుతో చేరతాడు.

మరోవైపు, ఆగస్టులో శస్త్రచికిత్స చేయించుకున్న అకీమ్ అగస్టే ఇంకా పునరావాస చికిత్స పొందుతున్నాడు. దీంతో అతడికి వన్డే జట్టులో చోటు దక్కలేదు. అతడి స్థానంలో టాప్, మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయగల జువెల్ ఆండ్రూను ఎంపిక చేశారు. ఇవి మినహా జట్టులో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు.

వెస్టిండీస్‌ జట్టు సెప్టెంబర్‌ 27 నుంచి భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత మూడు వన్డేలు, ఆతర్వాత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగనుంది. తొలి వన్డే తిరువనంతపురం వేదికగా సెప్టెంబర్‌ 27న జరుగనుండగా.. రెండో వన్డే సెప్టెంబర్ 30న గువాహటిలో, మూడో వన్డే అక్టోబర్ 3న న్యూ చండీగఢ్‌లో జరగనున్నాయి.

భారత్‌తో వన్డే సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు
షాయ్‌ హోప్ (కెప్టెన్), జువెల్ ఆండ్రూ, జాన్ క్యాంప్‌బెల్, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, అమీర్ జాంగూ, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, విటెల్ లాస్, గుడాకేశ్ మోటీ, కీమో పాల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జేడెన్ సీల్స్.

అక్టోబర్‌ 6 నుంచి టీ20 సిరీస్‌
వన్డే సిరీస్‌ అనంతరం​ అక్టోబర్‌ 6 నుంచి టీ20 సిరీస్‌ మొదలవుతుంది. ఈ సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టుకు కూడా షాయ్‌ హోప్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో యువ ఓపెనర్ కమిల్ పూరన్‌కు చోటు దక్కింది. CPL 2026లో పూరన్‌ అద్భుతంగా (8 ఇన్నింగ్స్‌ల్లో 159.64 స్ట్రైక్‌రేట్‌తో 273 పరుగులు) రాణించాడు. ఈ ప్రదర్శనతో అతడికి జాతీయ జట్టులో తొలిసారి అవకాశం లభించింది.

2026 టీ20 ప్రపంచకప్‌లో ఆడిన క్వెంటిన్ సాంప్సన్‌కు కూడా జట్టులో చోటు కల్పించారు. మరోవైపు, స్టార్‌ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌కు విశ్రాంతి ఇచ్చారు.

భారత్‌తో టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు
షాయ్‌ హోప్ (కెప్టెన్), జువెల్ ఆండ్రూ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రోన్ హెట్‌మయర్, అకీల్ హొసేన్, షమర్ జోసెఫ్, గుడాకేశ్ మోటీ, కీమో పాల్, కమిల్ పూరన్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, క్వెంటిన్ సాంప్సన్, రొమారియో షెఫర్డ్, షమర్ స్ప్రింగర్.

కాగా, 2022 తర్వాత వెస్టిండీస్ జట్టు తొలిసారి ద్వైపాక్షిక పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం భారత్‌లో పర్యటించనుంది. ఈ జట్టు టీమిండియాతో ఆడిన గత ఐదు వన్డేల్లోనూ ఓటమి చవిచూసింది. చివరిసారిగా 2019లో భారత్‌పై వన్డే విజయం సాధించింది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్న విండీస్.. 2027 వన్డే ప్రపంచకప్ అర్హత టోర్నీకి సన్నద్ధమయ్యేందుకు ఈ సిరీస్‌ను ఉపయోగించుకోనుంది.

టీ20 సిరీస్‌ విషయానికొస్తే.. 2023లో భారత్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను వెస్టిండీస్‌ 3-2తో గెలుచుకుంది. మూడు సంవత్సరాల తర్వాత విండీస్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్‌కు ఈ సిరీస్‌ ద్వారా అవకాశం లభించనుంది. 

ఇదీ చదవండి: మరో ముగ్గురికి టీమిండియా నుంచి పిలుపు



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement