Javed Miandad On BCCI: వాళ్లు వస్తే ఎంత? రాకుంటే ఎంత?.. పాక్‌ మాజీ ప్లేయర్‌ సంచలన వ్యాఖ్యలు

Asia Cup 2023: Miandad Sensational Comments They Can Go To Hell - Sakshi

Javed Miandad Fumes At ICC Over Asia Cup 2023: ఆసియా కప్‌-2023 నిర్వహణ, వేదిక తదితర అంశాలపై చిక్కుముడి వీడలేదు. బహ్రెయిన్‌ వేదికగా జరిగిన ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ విషయంపై మండలి ఓ నిర్ణయానికి వస్తుందని భావించినా అలా జరుగలేదు. దీంతో వచ్చే నెలలో మరోసారి సమావేశమైన తర్వాత ఈ మెగా టోర్నీ ఎక్కడ జరుగనుందన్న అంశంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కాగా ఈ ఏడాది సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా వన్డే కప్‌ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఈవెంట్‌ ఆడేందుకు భారత జట్టు పాక్‌కు వెళ్లదని బీసీసీఐ కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జై షా వ్యాఖ్యానించగా.. పాక్‌ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇంకా రాని స్పష్టత
అప్పటి నుంచి టోర్నీ నిర్వహణ ఎక్కడ అన్న అంశంపై సందిగ్దం కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం బహ్రెయిన్‌లో జరిగిన సమావేశంలో యూఏఈ పేరు ప్రస్తావన(తటస్థ వేదిక)కు వచ్చినా.. ఇంకా స్పష్టత రాలేదు. దీంతో మార్చి వరకు వేచిచూడాల్సిన పరిస్థితి.

ఏంటి ఇదంతా?
ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్‌ జావేద్‌ మియాందాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌ మద్దతు తమకేమీ అవసరం లేదని.. వాళ్లు పాకిస్తాన్‌లో ఆడకపోయినా పర్లేదని పేర్కొన్నాడు. అయినా ఐసీసీ ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నించాడు. భారత్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు.

ఎక్కడికైనా పోనివ్వండి... ఐసీసీ ఏం చేస్తోంది?
పాక్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇండియా తనకు ఇష్టం వచ్చినట్లు చేసుకోనివ్వండి.. వాళ్లు వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? వాళ్లతో మాకేం పనిలేదు. అసలు మేము వాళ్లను పట్టించుకోము. నిజానికి ఇక్కడ తప్పుబట్టాల్సింది ఐసీసీని. ఈ సమస్యకు పరిష్కారం చూపని ఐసీసీ ఉంటే ఎంత.. లేకుంటే ఎంత.. దాని వల్ల ఉపయోగం ఏమిటి?

మా దగ్గర ఇలాంటి చెల్లవు
ప్రతి జట్టుకు ఒకే రకమైన నిబంధనలు ఉండాలి కదా. టీమిండియా పటిష్ట జట్టే కావొచ్చు. అయినంత మాత్రాన వాళ్లొక్కలే క్రికెట్‌ ప్రపంచాన్ని నడిపించడం లేదు కదా. భారత జట్టు సొంతగడ్డపై పవర్‌హౌజ్‌ లాంటిది అయి ఉండవచ్చు.. అదంతా వాళ్ల దేశంలోనే చెల్లుతుంది. మా దగ్గర కాదు.

ప్రపంచం మొత్తం మీద వాళ్ల మాటే నెగ్గాలంటే కుదరదు. అయినా పాకిస్తాన్‌కు వచ్చి మీరెందుకు ఆడరు? ఒకవేళ ఇక్కడికి వచ్చి ఓడిపోతే ఆ దేశ ప్రజలు సహించరు. అందుకేనా’’ అంటూ కవ్వింపు మాటలు మాట్లాడాడు. అదే విధంగా.. ఐసీసీ ఇప్పటికైనా భారత బోర్డుపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. 

చదవండి: IND Vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌.. ఆ ఐదుగురు యమ డేంజర్‌.. ఏమరపాటుగా ఉంటే!
Jasprit Bumrah: ఆరోజు కోహ్లి బుమ్రాతో మాట్లాడతా అంటే నేనే వద్దన్నా! ఎందుకంటే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top