టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో ఘోర ఓటమి చవిచూసిన టీమిండియా.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమవుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో తలపడనుంది. సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో భారత్ ఖచ్చితంగా గెలవాల్సిందే.
ఈ నేపథ్యంలో భారత తుది జట్టులో మార్పులు చేయాలని మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ సూచించాడు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని పార్ధివ్ అభిప్రాయపడ్డాడు. కాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో అక్షర్ స్ధానంలో వాషింగ్టన్ సుందర్ను ఆడించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
అద్భుతమైన ఫామ్లో ఉన్న అక్షర్ను ఎలా పక్కన పెట్టారని మాజీలు మండిపడ్డాడు. ఈ కీలక మ్యాచ్లో సుందర్ బంతితో పాటు బ్యాట్తో కూడా విఫలమయ్యాడు. దీంతో జింబాబ్వేతో మ్యాచ్కు పటేల్ తిరిగి జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది.
"అక్షర్ పటేల్ను తిరిగి ప్లేయింగ్ ఎలెవన్లో చూడాలనుకుంటున్నాను. అక్షర్ లాంటి ఆల్రౌండర్ జట్టులో ఉండడం చాలా ముఖ్యం. అతడు కేవల బంతితోనే కాకుండా క్లిష్ట సమయాల్లో బ్యాట్తో కూడా రాణించగలడు. మ్యాచ్-అప్ల పరంగా కూడా అతడు మంచి ఎంపికే" అని స్టార్ స్పోర్ట్స్ షో 'ఫాలో ది బ్లూస్'లో పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. అదేవిధంగా ప్లేయింగ్ ఎలెవన్లోకి సంజూ శాంసన్ కూడా వచ్చే అవకాశముందని పార్ధివ్ తెలిపాడు. సంజూ లాంటి ప్లేయర్లు ఆఫ్ స్పిన్నర్లను అద్భుతంగా ఎదుర్కొంటారని పటేల్ చెప్పుకొచ్చాడు.
చదవండి: మా వాళ్లు అద్భుతం.. విండీస్ ప్రమాదకర జట్టు: మార్క్రమ్


