Anju Bobby George: భారత అథ్లెట్స్పై దిగ్గజ లాంగ్ జంపర్ సంచలన ఆరోపణలు
Published
Mon, May 30 2022 12:20 PM
భారత అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఏఎఫ్ఐ) వైస్ ప్రెసిడెంట్.. లెజెండరీ లాంగ్ జంపర్.. 2003 వరల్డ్ అథ్లెట్స్ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత అంజు బాబీ జార్జ్ భారత అథ్లెట్స్పై సంచలన ఆరోపణలు చేసింది. దేశంలో బ్యాన్ చేసిన చాలా రకాల నిషేధిత డ్రగ్స్ను కొందరు అథ్లెట్లు విదేశాల నుంచి తీసుకొచ్చి పంచుతున్నారని ఆరోపించింది. ఢిల్లీ వేదికగా ఆదివారం జరిగిన ఏఎఫ్ఐ రెండు రోజుల వార్షిక సర్వసభ్య సమావేశంలో అంజూ జార్జీ ఈ వ్యాఖ్యలు చేసింది.
''భారతదేశంలో నిషేధించబడిన అనేక డ్రగ్స్ పదార్థాలను విదేశాల నుంచి కొందరు అథ్లెట్లు విరివిగా తీసుకువస్తున్నారు. తాము వాడడమే కాకుండా మిగతా అథ్లెట్లకు నిషేధిత డ్రగ్స్ పంచడం దారుణం. వద్దని చెప్పాల్సిన కోచ్లే దగ్గరుండి డ్రగ్స్ అందజేస్తున్నారు. తమ ప్రదర్శనను మెరుగుపరుచుకునేందుకే కొందరు అథ్లెట్లు ఇలాంటి నిషేధిత డ్రగ్స్ వాడుతున్నారు. దేశంలో అథ్లెట్స్ నిషేధిత డ్రగ్స్ వాడకంలో పెరుగుదల ఆందోళనకరమైన విషయం'' అని పేర్కొంది.
కాగా ఏఎఫ్ఏ అధ్యక్షుడు ఆదిల్ సుమరివాలా మాట్లాడుతూ.. ''అంజూ బాబీ జార్జీ ఆరోపణను తీవ్రంగా పరిగణిస్తున్నాము. అథ్లెట్ల పరీక్షకు సంబంధించిన డోపింగ్ టెస్ట్ను మరింత కఠినతరం చేస్తాము. ఇప్పటికే ఈ విషయాన్ని నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (నాడా)కి ఈ విషయాన్ని తెలియజేశాం. డోపింగ్ పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించాలని వారిని కోరాం అని తెలిపారు.