
న్యూఢిల్లీ: యువ క్రీడాకారులకు ఆర్థికపరంగా అండగా నిలిచేందుకు అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) కొత్త పథకంతో ముందుకు వచ్చింది. ఇకపై జాతీయ స్థాయి క్రీడాకారులకు శిక్షణ తదితర అవసరాల కోసం ఉపకార వేతనం అందిస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి ఏప్రిల్–జూన్ మధ్య కాలానికి ఇప్పటికే రూ. 42.30 లక్షలను నేరుగా ఆటగాళ్ల అకౌంట్లకు బదిలీ చేసింది.
ఈ పథకం ద్వారా ప్రయోజనం అందుకునే వారిలో అండర్–7 నుంచి అండర్–19 వయో విభాగాల క్రీడాకారులు ఉన్నారు. రూ. 60 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఒక్కో ఆటగాడికి లభించాయి. ‘భారత చెస్లో తొలిసారి బాలుర విభాగంలో 39 మంది, బాలికల విభాగంలో 39 మంది ఆటగాళ్లను గుర్తించి భవిష్యత్తు కోసం వారిని తీర్చిదిద్దుతున్నాం. దీని ద్వారా వారికి కీలక దశలో ఆర్థికపరంగా వెసులుబాటు లభిస్తుంది.
ఇతరత్రా కూడా అన్ని రకాలుగా మేం మద్దతు అందిస్తాం. మరోవైపు జాతీయ స్థాయి టోర్నీల సంఖ్యను పెంచి పోటీల్లో పాల్గొనే అవకాశాలు కూడా పెంచుతాం. దాని వల్ల మంచి ప్రతిభ వెలుగులోకి వస్తుంది’ అని ఏఐసీఎఫ్ అధ్యక్షుడు నితిన్ నారంగ్ తెలిపారు. ఈ జాబితాలో తెలంగాణ నుంచి దివిత్ రెడ్డి , నిధీశ్ శ్యామల్ (అండర్–9), శ్రీరామ్ ఆదర్శ్ ఉప్పల, బి.కీర్తిక (అండర్–17), శరణ్య దేవి నరహరి (అండర్–13), ఆదిరెడ్డి అర్జున్, వేల్పుల సరయు (అండర్–19) ఉన్నారు.