సిద్దిపేటజోన్: చేయూత పథకం కింద అర్హులైన ప్రతి చేనేత కార్మికులకు పెన్షన్ మంజూరు చేయాలని రాష్ట్ర పద్మశాలీ సహకార సంస్థ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ వెంకట్ రమణ మంగళవారం మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని మంత్రి ఛాంబర్లో కలిసి సమస్యలపై వినతిపత్రాన్ని అందించారు. జియోట్యాగ్ నిబంధనల మేరకు చేయూత పెన్షన్ మంజూరు కాకుండా నేత వృత్తిలో కొనసాగుతున్న అర్హులైన కార్మికుడికి పింఛన్లు మంజూరు చేయాలని కోరారు.
ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి
జిల్లా ఇన్చార్జి వ్యవసాయాధికారి మల్లయ్య
తొగుట(దుబ్బాక): మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగుచేసి ఆర్థికంగా ఎదగాలని జిల్లా ఇన్చార్జి వ్యవసాయాధికారి మల్లయ్య రైతులకు సూచించారు. మండలంలోని బండారుపల్లిలో ప్రత్యామ్నాయంగా సాగుచేసిన కంది, అలసంద పంటలను మంగళవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ తమ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, నేల స్వభావం పరిగణలోకి తీసుకుని తక్కువ నీటితో సాగుచేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంపికచేసుకోవాలన్నారు. ఆరుతడి పంటలైన కంది, అలసంద, పెసలుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటస్వామిగౌడ్, ఎవో మోహన్, ఎఈవో నాగార్జున, రైతులు పాల్గొన్నారు.
కేసీఆర్ మళ్లీ సీఎం ఖాయం
ఆసిఫాబాద్ బీఆర్ఎస్ అభిమానుల పాదయాత్ర
ప్రశాంత్నగర్(సిద్దిపేట): కేసీఆర్ మళ్లీ తెలంగాణకు సీఎం అవుతారని, ఆసిఫాబాద్ బీఆర్ఎస్ అభిమానులు అన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గం వాంకిడి మండలం నుంచి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆధ్వర్యంలో తిరుపతి, శంకర్లు పాదయాత్రగా హైదరాబాద్కు బయలుదేరారు. ఇందులో భాగంగా మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అమరవీరులకు జోహర్లు అర్పించారు. కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగా ల్లో అభివృద్ధి చెందిందని, మళ్లీ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ సీఎం కావాలన్నారు.
అధికారుల విచారణ
దుబ్బాకటౌన్: రాయపోల్ ఎంపీడీఓ శ్రీనివాస్ పై ఇటీవల వచ్చిన అభియోగాల నేపథ్యంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సంధ్య, ఏపీడీ ఆనందమేరి, గజ్వేల్ డీఎల్పీఓ లత విచారణ చేపట్టారు. మంగళవారం రాయపోల్ మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్లను విడివిడిగా విచారణ చేపట్టారు. ఎంపీడీవో శ్రీనివాస్ పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సర్పంచుల అభిప్రాయాలను డిప్యూటీ సీఈవో సంధ్య నమోదు చేసుకున్నారు. అలాగే మండలంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలిసిమెలిసి పనిచేస్తేనే అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ కొనసాగుతాయని ప్రభుత్వం అందించే పథకాలు అభివృద్ధి పనులు గ్రామాలలో ప్రజలకు చేరాలంటే అందరూ కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలన్నారు.
చేపల పంపిణీ ఉత్తిదేనా?
చిన్నకోడూరు(సిద్దిపేట): మత్స్యకారులకు ప్రయోజనకరంగా ఉన్న ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ముదిరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జంగిటి శ్రీనివాస్ ఆరోపించారు. మంగళవారం మండల పరిధిలోని రంగనాయక సాగర్ వద్ద సంఘం నేతలతో కలిసి మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో నీటి వనరులు పెంపొందించి మత్స్యకారులను ఆదుకోవడానికి ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు.


