దుబ్బాకటౌన్: సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ ప్రతిష్టాత్మక ‘నేషనల్ సేవా రత్న’ అవార్డు అందుకున్నారు. జనసాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జేబీరాజు, జనసాహిత్య అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.పాముల రమణ ఆమెకు అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో పేదలు, మహిళలు, అనాథలు, సంచార జాతుల సంక్షేమం కోసం సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. సామాజిక బాధ్యతతో ప్రజలకు అండగా నిలుస్తున్న ఆమె సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారన్నారు. అనంత రం సుల్తానా ఉమర్ తన సేవలను గుర్తించి అవార్డుతో సత్కరించిన జనసాహిత్య అకాడమీ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.


