న్యూస్రీల్
శుక్రవారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2026
రూటు..
రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. గతుకుల రోడ్లు గాలికి వదిలేసి.. మెరుగ్గా ఉన్న రోడ్లనే మళ్లీ నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేశారు. ఇది హ్యామ్ రోడ్ల ఎంపికలో మన ఇంజనీరింగ్ అధికారుల తీరు. ఓ పక్క ధ్వంసమైన రోడ్లతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుంటే ఇవేమి పట్టించుకోకుండా కమీషన్ల కోసమే ఇలా ప్రతిపాదించారన్న చర్చ సాగుతోంది. ప్రజాప్రతినిధులను సంప్రదించకుండానే హ్యామ్ రోడ్లను ప్రతిపాదించారని ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి సమావేశంలోనే ఎంపీ, ఎమ్మెల్యేలు ఆరోపించడం గమనార్హం.
– సాక్షి, సిద్దిపేట
పల్లెల్లో రోడ్డు మార్గాలు మెరుగ్గా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(హ్యామ్)లో భాగంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా రూ.711.36కోట్ల వ్యయంతో 146 రోడ్లు 659.09 కిలోమీటర్ల రోడ్డును నిర్మించనున్నారు. ఇందులో రోడ్డు భవనాల శాఖ(ఆర్అండ్బీ) 17 రోడ్లు 195.75కిలో మీటర్లు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్(పీఆర్) 129 రోడ్లు 463.34కిలో మీటర్లు నిర్మాణం చేయనున్నారు..
డీడీఆర్సీ సమావేశంలో..
ఇంజనీరింగ్ అధికారులు గతుకుల రోడ్లను కాకుండా మరో ఐదేళ్ల వరకు ఢోకా లేని రోడ్లను హ్యామ్లో నిర్మించాలని నిర్ణయించారు. ఈ నెల 3న ఇన్చార్జి మంత్రి వివేక్ నిర్వహించిన డీడీఆర్సీ సమావేశంలో రోడ్ల విషయాన్ని ఎంపీ రఘునందన్ రావు ప్రస్తావించారు. హ్యామ్ రోడ్లను ఎవరిని అడిగి ప్రతిపాదించారని అధికారులపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులు సక్రమంగా వినియోగించకుండా అక్రమ మార్గానికి తరలించేందుకే మెరుగైన రోడ్లనే తిరిగి ప్రతిపాదించారని పలువురు ఆరోపిస్తున్నారు. కోట్లాది రూపాయలు రోడ్ల నిర్మాణాలకు ఖర్చు చేసినట్లు చూపించి కాంట్రాక్టర్ల లాభం కోసమే అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి హ్యామ్ రోడ్ల నిర్మాణం చేసే రోడ్లను పునఃపరిశీలించి, అవసరం ఉన్న చోట్ల తప్పక నిర్మాణం చేపట్టాలని ప్రజాప్రతినిధులు, ప్రజలు కోరుతున్నారు.
మర్కుక్ మండలం ఎర్రవల్లి నుంచి గంగాపూర్ రోడ్డును 2020లో రూ.5.5కోట్ల వ్యయంతో డబుల్ రోడ్గా నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం రోడ్డు మెరుగ్గా ఉన్నప్పటికీ తిరిగి హ్యామ్ రోడ్ కింద పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఎంపిక చేశారు. 2.55 కిలో మీటర్ల రోడ్ను నిర్మించాలని నిర్ణయించారు.
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో కొమురవెల్లి నుంచి మర్రిముచ్యాల రోడ్ నిర్మాణంను 2020లో చేశారు. ఇటీవల మంజూరైన హ్యామ్ రోడ్లలో ఇదే రోడ్ను 5.70 కిలోమీటర్ల రోడ్ను తిరిగి నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. రోడ్డులో ఎలాంటి గుంతలు లేకున్నా తిరిగి నిర్మాణం చేయాలని నిర్ణయించడంతో పలువురు విమర్శిస్తున్నారు.
టెండర్ దశలో ఉన్నవిఎంపిక చేయలేదు
గతంలో మంజూరై టెండర్ దశలో ఉన్న రోడ్లను ఎంపిక చేయలేదు. నిర్మించి ఐదు సంవత్సరాలు దాటిన వాటిని హ్యమ్ రోడ్ల కింద ఎంపిక చేశాం. రెండో ఫేస్లో మరి కొన్ని హ్యామ్ రోడ్లు మంజూరు కానున్నాయి.
– దీపక్, ఎస్ ఈ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్
ఈ ఫొటోలో కనిపిస్తున్నది గౌరారం నుంచి తూప్రాన్ వెళ్లే రహదారి. ఇది దాదాపు 16 కిలో మీటర్లు ఉంటుంది. ఇందులో వర్గల్ మండల కేంద్రం ఎల్లమ్మ దేవాలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు నిర్మాణం కోసం ఇటీవల గ్రామ ప్రజలు, సర్పంచ్ ఒక రోజు దీక్షను చేపట్టి నిరసన తెలిపారు.


