సిద్దిపేటకమాన్: వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని డీఎంహెచ్ఓ ధనరాజ్ ప్రజలకు సూచించారు. అంటువ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా జిల్లా వైద్యారోగ్యశాఖ చేపడుతున్న ముందస్తు చర్యలపై డీఎంహెచ్ఓ మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సిద్దిపేట పట్టణంలోని బస్తీ దవాఖాన, ముస్తాబాద్ చౌరస్తాలోని టీ స్టాళ్లు, పరిసర ప్రాంతాల్లో సిబ్బంది చేపడుతున్న ఫాగింగ్ను డీఎంహెచ్ఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో వర్షపు నీరు నిలిచి దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు నివారణ చర్యలు, కార్యక్రమాలు మరింత ముమ్మరం చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ వినోద్బాబ్జి, డాక్టర్ శ్రీకాంత్యాదవ్, ఏఎన్ఏంలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి
డీఎంహెచ్ఓ ధనరాజ్


