సిద్దిపేటకమాన్: ‘నులిపురుగులను నిర్మూలిద్దాం.. పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుదాం’ అని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 1నుంచి 19ఏళ్ల వయసు గల పిల్లలందరికీ ఈ నెల 13న ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మిగిలిపోయిన వారికి ఈనెల 20న మాత్రలు వేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, నర్సింగ్ కళాశాల, ఆరోగ్య కేంద్రాల్లో మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గుర్తించిన పిల్లలకు తప్పనిసరిగా మాత్రలు వేయించాలన్నారు. విద్యా, మహిళ, శిశు సంక్షేమ శాఖ, పంచాయితీ రాజ్, మున్సిపల్, ఇతర అనుబంధ శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ కోరారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు వినోద్బాబ్జి, డాక్టర్ శ్రీకాంత్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


