మెదక్ అర్బన్: తొలకరి జల్లు కురియగానే పంట పొలాల్లో కనిపించే అరుదైన అందమైన జీవి ఆరుద్ర పురుగు. ఇవి విరివిగా కనిపిస్తే పంటలు సమృద్ధిగా పండుతాయని, వర్షాలు దండిగా కురుస్తాయని రైతుల నమ్మకం. కానీ రాను రాను ఆరుద్ర పురుగులు అంతరిస్తున్నాయి. రైతు నేస్తాలుగా భావించే పర్యావరణ మిత్రలు కనుమరుగవుతున్నాయి. ఆరుద్ర కార్తె ముగిసినా సరైన వర్షాలు కురవకపోవడంతో రైతులు సైతం సాగు పనులు చేపట్టలేదు.
పుడమి తల్లికి సింధూరం
శాసీ్త్రయంగా ‘ట్రాంబిడియం గ్రాండిస్సిమం’గా పిలిచే ఈ పురుగులు చిన్న పరిణామంలో మక్మల్ బట్టలాగా, ముదురు ఎరుపు రంగులో చూడముచ్చటగా ఉంటాయి. ముట్టుకుంటే ముడుచుకొని కాస్సేపు కదలకుండా బొమ్మలా నిలబడిపోతాయి. తమ జీవిత కాలంలో ఎక్కువగా భూమి లోపలే ఉంటాయి. కేవలం వర్షాకాలంలో మాత్రమే సంతానోత్పత్తి కోసం భూమి పైకి వస్తాయి.
రైతు నేస్తం.. పర్యావరణ మిత్ర
రైతు మిత్రగా పిలువబడే ఆరుద్ర పురుగులు భూమిలో ఉండే చిన్న చిన్న హానికరమైన కీటకాలు. లార్వాలను తిని పంటలకు రక్షణగా నిలుస్తాయి. ఈ మధ్య వీటిని ఔషధాల తయారీలో కూడా వాడుతున్నారు. ఆయుర్వేద వైద్య గుణాలున్నాయని అంటారు. కిలోకు రూ.800 నుంచి 1000 వరకు విక్రయిస్తున్నారని తెలిసింది. దీంతో పర్యావరణానికి ఉపయోగపడే ఆరుద్ర పురుగుల ఉనికికే ప్రమాదం ఏర్పడిందనే ఆరోపణలు వెల్తువెత్తుతున్నాయి. ఇవి శివునికి ప్రీతి పాత్రమైన జీవులని వేద పండితులు చెబుతారు. చిన్పపిల్లలు వీటిని పట్టుకొని, అగ్గిపెట్టెలో వేసుకొని ఆడుకుంటారు.


