జిల్లాలో 1.18 లక్షల ఎకరాలకుపైగా
అంచనాకు..
ఇప్పటికే పంట సాగులోకి
70 వేల ఎకరాలకుపైగా
విత్తనాలు వచ్చింది 7 వేల
ఎకరాలలోపు అవసరాలకే
మూడు రోజులుగా పంపిణీ ప్రక్రియ
సత్ఫలితాలపై అనుమానమే!
సీజన్ ముగుస్తున్న సమయంలో ఉచిత పత్తి విత్తనాల పంపిణీ
జిల్లాలో జాతీయ పత్తి ఉత్పాదకత పథకం (మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ) ఆధ్వర్యంలో సాగుతున్న ఉచిత పత్తి విత్తనాల పంపిణీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీజన్ ముగిసే సమయంలో విత్తనాలను పంపిణీ చేయడం, అదీ కూడా అరకొరగా సాగుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. మూడు రోజులుగా హడావిడిగా సాగుతున్న ఈ పథకం సత్ఫలితాలపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ ఫోకస్
– గజ్వేల్
పత్తి సాగు అధికంగా ఉండే రాష్ట్రంలోని 19 జిల్లాలను జాతీయ పత్తి ఉత్పాదకత పథకానికి ఎంపిక చేశారు. ఇందులో సిద్దిపేట జిల్లా కూడా ఒకటి. అధిక సాంద్రత లేదా క్లోజర్ స్పేస్ విధానాల్లో పత్తి సాగును ఈ పథకంలో ప్రోత్సహిస్తారు. అధిక సాంద్రత విధానంలో ఎకరాకు 29 వేల మొక్కలను విత్తే అవకాశం ఉంటుంది. క్లోజర్ స్పేస్ విధానంలో ఎకరాకు 15వేలకు పైగా మొక్కలను విత్తుతారు. అధిక సాంద్రత పద్ధతికి ఎకరాకు 6 ప్యాకెట్లు, క్లోజర్ స్పేస్ పద్ధతికి 4 విత్తన ప్యాకెట్లు అవసరముంటాయి. సాధారణ పద్ధతిలో అయితే రైతులు కేవలం 2నుంచి రెండున్నర ప్యాకెట్ల విత్తనమే వాడతారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న అధిక సాంద్రత, క్లోజర్ స్పేస్ విధానంలో మొక్కకు, మొక్కకు మధ్యన దూరం తగ్గిపోయి అధిక దిగుబడులకు అవకాశం కలగనుంది. ఈ క్రమంలోనే రైతులకు ప్రభుత్వం ఈ రెండు పద్ధతులను అనుసరించే రైతులకు అవసరమైన విత్తనాలను అధికారులు అందజేయనున్నారు. పత్తి ఎదుగులకు అవసరమయ్యే మందులు, క్రిమిసంహారకాలు కూడా పంపిణీ చేయనున్నారు. అధిక సాంద్రత పద్ధతి పాటించే రైతులకు ఎకరాకు రూ.7వేల వరకు, క్లోజర్ స్పేస్ పద్ధతికి విత్తనాలతో కలుపుకొని రూ.5,500వరకు ఇన్పుట్స్ ఇస్తారు.
ప్రణాళికబద్ధంగా జరిగి ఉంటే...
ఈ పథకానికి సంబంధించి ప్రణాళికబద్ధంగా మే నెల నుంచే కార్యాచరణ అమలు చేసి ఉంటే మంచి ఫలితాలకు అవకాశం ఉండేది. జిల్లాలో పత్తి సాగులో రైతులు మూస పద్ధతికి అలవాటుపడ్డారు. ఇష్టానుసారంగా సాగుచేయడం వల్ల దిగుబడులు నానాటికీ పడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధిక సాంద్రత, క్లోజర్ స్పేస్ పద్ధతులవైపు రైతులను మళ్లించి, ఉచిత విత్తనాలను, ఇన్పుట్స్ను సకాలంలో పంపిణీ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ నేడు జిల్లాలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఆలస్యంగా, అరకొరగా అమలవుతున్న జాతీయ పత్తి ఉత్పాదకత పథకం వల్ల సత్ఫలితాలు అనుమానంగా ఉన్నాయి.


