● మాజీమంత్రి హరీశ్రావు ● రూ.72 లక్షల విలువైన 91 టీ స్టాల్స్ పంపిణీ
సిద్దిపేటజోన్ /ప్రశాంత్నగర్(సిద్దిపేట): కష్టపడి పనిచేసుకునే వారికి ఎల్లప్పుడూ తనవంతు సహకారం ఉంటుందని వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తానని మాజీమంత్రి హరీశ్రావు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో హోటల్స్ నడుపుతూ ఉపాధి పొందుతున్న వారికి నెక్ (ఎన్ఈసీసీ)సహకారంతో రూ.72 లక్షల విలువైన 91 టీ స్టాళ్లను ఆదివారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.... మీ కష్టానికి తనవంతు తోడుగా ఈ స్టాళ్లను అందిస్తున్నానన్నారు. టీ స్టాల్తో పాటు గ్యాస్ సిలెండర్, స్టౌవ్, ఎల్ఈడీ లైట్స్, వాటర్ బాటిల్స్, హోటల్కు అవసరమైన సామగ్రి అందించారు.
బృందావన్ కాలనీలో సీసీ కెమెరాలు
ప్రారంభించిన హరీశ్రావు
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో క్లీన్, గ్రీన్, సేఫ్ సిద్దిపేట పట్టణాన్ని నిర్మించుకున్నామని, మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని బృందావన్ కాలనీలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సిద్దిపేట అంటే పచ్చదనం, పరిశుభ్రత, ప్రజారక్షణగా చేసుకున్నామన్నారు. సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, చెట్లు నాటడం లాంటి కార్యక్రమాలు చేశామని చెప్పారు. కాలనీలో హనుమాన్ దేవాలయ నిర్మాణానికి, కాలనీ అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఏదైనా సాధ్యమవుతుందనడానికి బృందావన్ కాలనీ ఆదర్శమన్నారు. కార్యక్రమంలో కాలనీ వాసులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


