● శిథిలావస్థలో పాఠశాల భవనం ● భయాందోళనలో విద్యార్థులు
దుబ్బాకటౌన్: దౌల్తాబాద్ మండలం దీపాయంపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు భయాందోళనల మధ్య చదువులు కొనసాగిస్తున్నారు. భవనం పైకప్పు పలుచోట్ల పెచ్చులు ఊడిపోవడం, ఇనుప రాడ్లు బయటకు కనిపించడం, గోడలకు భారీ పగుళ్లు ఏర్పడటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు, గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తరగతి గదుల్లోకి వర్షపు నీరు చేరుతుండటంతో విద్యార్థులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇంత ప్రమాదకర పరిస్థితి ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త భవనాన్ని నిర్మించాలని లేదా ప్రస్తుత భవనానికి అత్యవసర మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు, కోరుతున్నారు.


