డిప్యూటీ సీఎం భట్టిని కోరిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి
దుబ్బాక: నియోజకవర్గం అభివృద్ధికి సహకారం అందిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీనిచ్చినట్లు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి హైదరాబాద్లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ‘సాక్షి’తో మాట్లాడారు. నియోజకవర్గం అభివృద్దికి సంబంధించిన పలు అంశాలను విక్రమార్క దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. నార్సింగ్ మండలానికి కొత్తగా తహసీల్దార్ కార్యాలయం భవనం మంజూరు చేయడంతోపాటు అక్బర్పేట–భూంపల్లి, రాయపోల్, నార్సింగ్ మండలాలకు ఎంపీడీఓ కార్యాలయ భవనాల నిర్మాణాలకు అవసరమైన పరిపాలన అనుమతులు, నిధులు మంజూరు చేయాలని కోరామని తెలిపారు. నియోజకవర్గంలోని ఆర్అండ్బీ, పీఆర్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరామన్నారు. ఈ అంశాలపై మంత్రి విక్రమార్క సానుకూలంగా స్పందించినట్లు వివరించారు.


