జిల్లా యంత్రాంగానికి సీఎస్ జాజు సూచన
సిద్దిపేటజోన్: ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పలు సూచనలు చేశారు. ప్రధానంగా వ్యవసాయ, తాగునీరు, సాగునీరు, ప్రజారోగ్యం, విద్య, ఉద్యానవన, ఆయిల్పామ్ విస్తరణ, రైతు రిజిస్ట్రీ, మధ్యాహ్న భోజనం, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలపై సమీక్షించారు. వ్యవసాయ సీజన్ విజయవంతం చేసేందుకు సమిష్టిగా అన్ని శాఖల అధికారులు పనిచేయాలన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా నకిలీ విత్తనాలు, ఎరువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు రిజిస్ట్రీ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ...జిల్లాలో ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వానాకాలం సీజన్ సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉండేలా చూస్తామని, కొరత లేకుండా సకాలంలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లాలో తాగునీరు సరఫరా అంశంపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని,వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా కాన్ఫరెన్స్లో జిల్లా అధికారులు స్వరూప రాణి, సువర్ణ, ధనరాజ్, వెంకట్రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు.


