డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్
సిద్దిపేటకమాన్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వర్షాకాలం నేపథ్యంలో జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉందని తెలిపారు. ప్రజలు తమ ఇంటి పరిసరాల పరిశుభ్రతతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం డ్రై డే తప్పనిసరిగా పాటించాలన్నారు. జిల్లా టాస్క్ఫోర్స్, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేసి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జ్వర తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అవసరమైతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసుకోవా ల ని సూచించారు. ఇంటి పరిసరాల్లో, వినియోగంలో లేని టైర్లు, కొబ్బరి చిప్పలు, పూల కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వేడి వేడి తాజా ఆహారం తీసుకోవాలని సూచించా రు. జ్వర లక్షణాలు, తలనొప్పి, కీళ్ల నొప్పులు, వాంతులు, విరేచనాలు, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తే దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు నిర్వహించుకుని, చికిత్స తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతి గృహాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ విద్యార్థులకు సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.


