చేర్యాల(సిద్దిపేట): దానంపల్లి మహిళా సంఘంలో జరిగిన అక్రమాలపై చర్యలు చేపట్టాలని, సొమ్మును రికవరీ చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొంగరి వెంకట్మావో డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఎం బృందం గ్రామంలో పర్యటించి మహిళా సంఘాల సభ్యులు, గ్రామైక్య సంఘం అధ్యక్ష కార్యదర్శులతో మాట్లాడి వాస్తవ విషయాలను తెలుసుకున్నారు. అనంతరం వెంకట్మావో మాట్లాడుతూ గ్రామంలో 27 మహిళా సంఘాలు ఉన్నాయని, ఈ సంఘాలకు సీఏగా ఉన్న మమత సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, గ్రామైఖ్య సంఘం అధ్యక్ష, కార్యదర్శుల కళ్లుగప్పి బ్యాంకు అధికారుల కను సన్నలలో లక్షలాది రూపాయలు కాజేసినట్లు ఆరోపణలున్నాయన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాడు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు తిరుపతి, మైసయ్య, రేకులు గ్రామైఖ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు కళావతి, రజిత, సునీత తదితరులు పాల్గొన్నారు.


