న్యూస్రీల్
కాంగ్రెస్ జంబో కమిటీ
సాక్షి, సిద్దిపేట: ఎట్టకేలకు పూర్తి స్థాయిలో జిల్లా కాంగ్రెస్ కమిటీని టీపీసీసీ ప్రకటించింది. గతేడాది నవంబర్22న డీసీసీ అధ్యక్షురాలిగా తూంకుంట ఆంక్షారెడ్డిని నియమించారు. డీసీసీ కమిటీ కోసం జిల్లాకు సమన్వయ కర్తలు అల్లాడి పవన్, రోహిత్లను టీపీసీసీ నియమించగా వీరు రెండు మూడు మార్లు జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి ముఖ్యకార్యకర్తలు, నేతలతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ నేతల సలహాలు, సూచనలతో చివరకు పూర్తి స్థాయి కమిటీని గురువారం ప్రకటించారు.
ఉపాధ్యక్షులు తొమ్మిది మంది
జిల్లా కాంగ్రెస్ కమిటీని 85 మందితో టీపీసీసీ ప్రకటించింది. అందులో ఉపాధ్యక్షులు తొమ్మిది మంది, ప్రధాన కార్యదర్శులు 20, అధికార ప్రతినిధులు నలుగురు, కార్యదర్శులు 36 మంది, జిల్లా కమిటీ సభ్యులు 16 మందిని నియమించారు. ఈ కమిటీ రెండేళ్లు ఉంటుందా? లేక జిల్లా అధ్యక్షురాలు పదవీ కాలం ముగిసినప్పుడే వీరిది సైతం ముగుస్తుందా? అని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు చర్చించుకుంటుండటం గమనార్హం.
కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం
జిల్లా వ్యాప్తంగా మండల సమావేశాల్లోనే పార్టీ పదవులు ఆశించే వారి నుంచి నామినేషన్లను స్వీకరించారు. సామాజిక సమీకరణాలు, నాయకుల సమర్థత, సీనియార్టీలను పరిశీలించి పదవులు ఇచ్చారని ఓ వర్గం కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కొత్త వారికే ఇచ్చారని మరో వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. కొత్తగా వచ్చిన వారికి డీసీసీ కమిటీలో ప్రాధాన్యత ఇచ్చారని, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నంటి ఉన్నవారికి పదవులు ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పదవులు ఇవ్వడంతో పలువురు నిరాశ చెందుతున్నారు.
ఎట్టకేలకు జిల్లా పూర్తి స్థాయి నియామకం


