చేర్యాలలో 6,429 బస్తాలు పక్కదారి
● గుర్తించిన వ్యవసాయ శాఖ ● తాజాగా బైరాన్పల్లిలో 13 బస్తాలు మాయం
సాక్షి, సిద్దిపేట: యూరియా పంపిణీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. పంపిణీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ తీసుకువచ్చినప్పటికీ ఫర్టిలైజర్ షాప్ యజమానుల అక్రమాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఇప్పటికే చేర్యాలలో 6,429 యూరియా బస్తాలు రైతుల పేర్లతో కాజేశారు. గుర్తించిన వ్యవసాయ అధికారులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సదరు యజమాని సందీప్రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఓ పక్క చర్యలు తీసుకుంటున్నా తాజాగా దూల్మిట్ట మండలం బైరాన్పల్లి రైతు సేవా కేంద్రంలో రైతు పేరు మీద వచ్చిన యూరియాను అక్రమంగా తరలించినట్లు ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది.
దూల్మిట్ట మండలం కూటిగల్ గ్రామానికి చెందిన నందనబోయిన కుమార్ అనే రైతు మార్చి 8న బైరాన్పల్లిలోని రైతు సేవా కేంద్రంలో 13 బస్తాల యూరియాను బుక్ చేసుకున్నారు. అదే నెల 9న యూరియా తీసుకువెళ్లవచ్చని సమాచారం వచ్చింది. అయితే యూరియా లేదని రైతును యజమాని వెనక్కి పంపించారు. దీంతో చేసేదేమిలేక ఇంటికి వచ్చిన తర్వాత రైతు ఫోన్లో యూరియా కొనుగోలు చేసినట్లు ఎస్ఎంఎస్ వచ్చింది. అవక్కాయిన కుమార్ రైతు సేవా కేంద్రం నిర్వాహకుడుని నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో యూరియా అక్రమాలు మరొకటి వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితుడు తెలిపారు.
కాసులకు ఆశపడి..
ప్రభుత్వం సబ్సిడీపై అందించే యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తుంటే మరో పక్క కొందరు వ్యాపారులు కాసులకు ఆశపడి పక్కదారి పట్టిస్తున్నారు. యూరియా పక్కదారి పట్టవద్దన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యాప్లో బుక్ చేసుకున్న వారికే యూరియా బస్తాలను అందజేస్తున్నారు. అయినప్పటికీ ఫర్టిలైజర్ షాప్ల యజమానులు అక్రమాలు ఆపడం లేదు.


