● సీపీ రష్మీ పెరుమాళ్ ● రావురూకులలో కెమెరాల ప్రారంభం
సిద్దిపేటరూరల్: నేర నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అన్నారు. బుధవారం సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని రావురూకులలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిద్దిపేట సురక్ష నేత్ర ప్రాజెక్ట్ ప్రారంభించిన వంద రోజుల్లోనే జిల్లా వ్యాప్తంగా 1000కి పైగా సీసీ కెమెరాలను విజయవంతంగా ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. సీసీ కెమెరాలు ప్రజల రక్షణ, భద్రత కోసం నిరంతరం పనిచేస్తూ, గ్రామాలను 24 గంటలు నిఘా నీడలో ఉంచుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే 100 నంబర్ కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఎవరైనా సైబర్ నేరానికి గురై ఆర్థికంగా నష్టపోతే, ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సిద్దిపేట ఏసీపీ రవీందర్, సిద్దిపేట రూరల్ సీఐ విద్యాసాగర్, సీఐ వాసుదేవరావు, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
దుబ్బాకరూరల్: మండలంలోని పాతారంలో సీపీ రష్మీపెరుమాళ్ సిసి కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎవ్వరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే వ్యక్తి గత వివరాలు చెప్పకూడదన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొంత మంది మోసగాళ్లు నిరుద్యోగులను నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నారని అలాంటి మోసగాళ్లను నమ్మకూడదన్నారు. ఎవ్వరైనా అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.


