● ఏరువాక పౌర్ణమి మరుసటి రోజే పెట్టుబడి సాయం ● మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్రూరల్: రైతులకు బాసటగా ప్రజాపాలన ప్రభుత్వం నిలుస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం నగరంలో జరిగిన రైతు సదస్సులో సీఎం రేవంత్రెడ్డి రైతులకు వానాకాలం పెట్టుబడి సాయం నిధులను విడుదల చేసే కార్యక్రమాన్ని మీర్జాపూర్ రైతు వేదికలో రైతులతో కలిసి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగు ఎక్కువగా ఉందని మిగతా రైతులు కూడా ఆ దిశగా సాగు చేయాలన్నారు. ఏరువాక పౌర్ణమి రోజున రైతులు కొత్త సాలు పెట్టగానే ప్రభుత్వం పెట్టుబడి సహాయం చేసిందన్నారు రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే ఎక్కువ లాభలు వస్తాయని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో రామ్మూర్తి, తహసీల్దారు లక్ష్మారెడ్డి, ఏడీఏ వీణారెడ్డి, ఏఓ పూజ, సర్పంచ్లు పాల్గొన్నారు.
బీజేపీ నేతల ఇళ్లను ముట్టడిస్తాం
హుస్నాబాద్: ఎరువుల తయారీ, సరఫరా బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, రైతులకు ఎరువుల కొరత ఏర్పడితే బీజేపీ నాయకుల ఇళ్ల ఎదుట ధర్నా చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించా రు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎరువుల కొరత లేకుండా తెలంగాణలోని బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు బాధ్యత వహించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. డిమాండ్ మేరకు ఎరువుల సరఫరాతో పాటు రామగుండం ఫ్యాక్టరీలో తయారయ్యే ఎరువులను తెలంగాణ రైతాంగానికే అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉద్ధేశపూర్వకంగానే తెలంగాణకు సరఫరాను తగ్గిస్తోందన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాపాతం తగ్గడం వల్ల రైతులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. ఓటరు సవరణ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. పట్టణంలోని 17, 18వ వార్డుల్లో ఓటరు సవరణ పురోగతిని పరిశీలించారు.


