● రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ● గజ్వేల్లో డీబీఎఫ్ జిల్లా మహాసభ
గజ్వేల్: భారత రాజ్యాంగ పరిరక్షణకు సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరముందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పిలుపునిచ్చారు. మంగళవారం గజ్వేల్లో నిర్వహించిన డీబీఎఫ్ (దళిత బహుజన ఫ్రంట్) జిల్లా మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి అడ్డకట్టవేయడం ద్వారానే హక్కులను కాపాడుకోగలుగుతామని చెప్పారు. దళితబహుజనులకు ఎక్కడ అన్యాయం జరిగినా, డీబీఎఫ్ అండగా ఉంటూ పోరాటం చేస్తున్నదని చెప్పారు. తన చైర్మన్ పదవీకాలం ముగిశాక, తానూ కూడా డీబీఎఫ్ పోరాటాల్లో భాగస్వామిగా ఉంటానని ప్రకటించారు. డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ‘ఉపాధి’ హక్కులను హరించేవిధంగా వీబీరామ్జీ చట్టాన్ని తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఇంకా ఈ మహాసభల్లో ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, డీబీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రౌతు రమేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్ల శంకర్, బీఎస్పీ నాయకుల స్వామి పాల్గొన్నారు.
డీబీఎఫ్ జిల్లా అధ్యక్షునిగా వేణు
గజ్వేల్లో జరిగిన జిల్లా మహాసభల్లో డీబీఎఫ్ నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షునిగా బ్యాగరి వేణు, ఉపాధ్యక్షులుగా పోతరాజు శంకర్, ప్రధాన కార్యదర్శిగా భీమ్ శేఖర్, కార్యదర్శిగా సతీష్కుమార్తోపాటు ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.


