● నిలిచిన రిజిస్ట్రేషన్లు ● క్రయ విక్రయదారులకు తప్పని తిప్పలు
సిద్దిపేటకమాన్: సాంకేతిక సమస్య తలెత్తడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. కొద్ది సమయం మాత్రమే పనిచేయడంతో మూడు, నాలుగు దస్తావేజులు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ముందుగా స్లాట్లు బుక్ చేసుకున్న ప్లాట్ల క్రయ విక్రయదారులు రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో గంటల కొద్దీ ఎదురు చూశారు. సాయంత్రం వరకు అదే పరిస్థితి ఉండటంతో క్రయ విక్రయదారులు నిరాశతో వెనుదిరిగారు. జిల్లాలో సిద్దిపేట అర్బన్, రూరల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల సబ్ రిజిస్ట్రేషన్ల కార్యాలయాల ద్వారా ప్లాట్లు, భవనాలు, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నూతన సర్వర్ ఇన్స్టాలేషన్ ప్రక్రియ చేయడంతో జూన్ 26, 27, 28వ తేదీల్లో మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. సోమ, మంగళవారాలు కార్యాలయాలు పనిచేసినప్పటికీ సాంకేతిక సమస్య తలెత్తడంతో సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో క్రయవిక్రయ దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిద్దిపేట సబ్రిజిస్ట్రార్ అర్బన్, రూరల్ కార్యాలయంలో సోమవారం 11, మంగళవారం 8, చేర్యాలలో 6 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయి. దుబ్బాక కార్యాలయంలో సర్వర్ సమస్యతో ఒక్క డాక్యుమెంట్ కూడా రిజిస్ట్రేషన్ జరగలేదు. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు.


