సిద్దిపేటకమాన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జి.సుదర్శన్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు విధులు నిర్వహించిన సాయిరమాదేవి బదిలీ కాగా ఆమె స్థానంలో రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ ఫ్యామిలీ కోర్టు నుంచి జి.సుదర్శన్ నియామకమయ్యారు. ఈ మేరకు న్యాయమూర్తి సుదర్శన్ సిద్దిపేట కోర్టు ఆవరణలో పోలీసు గౌరవ వందనం స్వీకరించి బాధ్యతలు చేపట్టారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ప్రధాన న్యాయమూర్తిని పలువు రు న్యాయమూర్తులు అభినందించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జయప్రసాద్, సంతోష్కుమార్, కుమారస్వామి, సాధన, తరణి, సౌజన్య, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
చేనేత పరిశ్రమకు నిధులివ్వండి
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి
దుబ్బాక: దుర్భర పరిస్థితుల్లో ఉన్న చేనేత పరిశ్రమకు ప్రత్యేక నిధులు ఇచ్చి ప్రభుత్వం కాపాడాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. దుబ్బాక పట్టణంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన నీలకంఠ సమాజం దుకాణ సముదాయా న్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నారు. చేనేత కార్మికులు సైతం ఇతర రంగాల వైపు దృష్టి సారించాలన్నారు. దుబ్బాక ప్రాంతం చేనేతకు చాలా ప్రసిద్ధి అని, ఇక్కడ నేతన్నలకు ఉపాధి కల్పించే మార్గాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. నేతన్నల సంక్షేమం కోసం శాయశక్తుల కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరాం సంగీత, కౌన్సిలర్లు, నీలకంఠ సమాజం అధ్యక్షులు తదితరులు ఉన్నారు.
ఫర్టిలైజర్ షాపులో
అమ్మకాలు నిలిపివేత
వర్గల్(గజ్వేల్): నిబంధనలు ఉల్లంఘించిన ఫర్టిలైజర్ షాప్లో అమ్మకాలు నిలిపేస్తూ ములుగు ఏడీఏ (వ్యవసాయ సహాయ సంచాలకులు) అనిల్కుమార్ ఆదేశాలు జారీచేశారు. సోమ వారం ఆయన వర్గల్ మండలం శాకారంలోని డిబిల్ అగ్రిసైన్సెస్ సీడ్స్, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్ షాప్ను ఆకస్మిక తనిఖీ చేశారు. వివిధ రికార్డులు పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్కులు అప్డేట్ చేయలేదని గుర్తించారు. నిబంధనలు పాటించకుండా ఎరువులు, విత్తనాలు, పెస్టిసైడ్స్ అమ్ముతున్నట్లు తనిఖీలో వెల్లడైంది. ఈ మేరకు శాఖాపరమైన చర్యలు చేపట్టి, ఆ షాపులో అమ్మకాలు నిలిపేసినట్లు ఏడీఏ అనీల్కుమార్ తెలిపారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
నాణ్యమైన విద్య అందించాలి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం ఉపాధ్యాయులకు సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన చెత్తను తొలగించి పాఠశాల సిబ్బందితో శుభ్రం చేయించారు. పాఠశాలలో ఏమైన సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


