● ఒక వ్యక్తికి ఒకే ఓటు ● మెదక్ ఎంపీ రఘునందన్రావు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఎస్ఐఆర్పై అపోహలు వద్దని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. ఆదివారం బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మన్కీ బాత్ను పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తిలకించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎస్ఐఆర్ తో ఓట్లను తొలగిస్తున్నారనడం అవాస్తవమన్నారు. నకిలీ ఓట్లు మాత్రమే తొలగిస్తారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు బీఎల్ఓ, బీఎల్ఏలతో ఓటర్ల ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఓటర్లను ఆందోళనకు గురి చేస్తున్నారన్నారు. అనేక మంది ప్రజలు ఉపాధి నిమిత్తం పట్టణాలకు వచ్చారని, వారికి స్వగ్రామంతో పాటు పట్టణాలలో ఓట్లు ఉన్నాయన్నారు. సిద్దిపేట పట్టణంలోని కొంత మంది రాజకీయ నాయకులు బీఎల్వోలను, బీఎల్ఏలను తమ ఇంట్లో కుర్చోబెట్టుకుని మ్యాపింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, కలెక్టర్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులు చేసే ఓట్ల మ్యాపింగ్లకు ఓటర్లు సహకరించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం టోల్ఫ్రీ నెంబర్కు ఫిర్యాదులు చేసుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో 10 బీజేపీ జిల్లా కార్యాలయాలను బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ వర్చువల్గా ప్రారంభిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
బీజేపీ కార్యాలయం ప్రారంభం
సిద్దిపేట బీజేపీ జిల్లా కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వర్చువల్ విధానంలో ఆదివారం ప్రారంభించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ ప్రారంభం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో విద్యాసాగర్, బాలేష్గౌడ్, కప్పర ప్రసాద్, వెంకట్, సంతోష్, పద్మ, ఉమారెడ్డి, తిరు మల, మార్కండేయులు, తదితరులు పాల్గొన్నారు.


