దుబ్బాక: చేనేత కార్మికుల ఎదురుచూపులకు తెరపడనుంది.13 ఏళ్ల నిరీక్షణ అనంతరం చేనేత సహకార ఎన్నికలకు రంగం సిద్ధమైంది. త్వరలో సహకార పోరుకు ముహూర్తం ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఈ నెల 29న ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే చేనేత సంఘాల ఓటరు జాబితా సిద్ధమై రాష్ట్ర ఎన్నికల సంఘానికి చేరింది. ఎట్టకేలకు ఎన్నికలకు ముహుర్తం వెలువడనుండటంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
13 ఏళ్ల నిరీక్షణ..
చేనేత సహకార సంఘాలకు 13 ఏళ్లుగా ఎన్నికలు లేకపోవడంతో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. సంఘాలు ఆర్థికంగా పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకపోవడంతో నేతన్నలకు పని దొరకక వారి కుటుంబాల పరిస్థితి కడు దయనీయంగా తయారైంది. చివరిసారిగా 2013లో చేనేత సంఘాలకు ఎన్నికలు జరిగాయి. 2018 లో వాటి పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రతీ 6 నెలలకు ఒకసారి చొప్పున ఇప్పటి వరకు ప్రభుత్వం 16 పర్యాయాలు పాలకవర్గాల పదవీకాలం పొడిగిస్తూ వచ్చింది.
రికార్డులు అందజేయకపోవడంతో..
జిల్లాలో 18 చేనేత, ఉన్ని సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో సిద్దిపేట ఉన్ని సహకార సంఘం రికార్డులు అందజేయకపోవడంతో ఎన్నికలకు దూరంకానుంది. దీంతో 17 సంఘాలకే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మరో ఏడు సొసైటీలు సిద్దిపేట, ధర్మారం, చేర్యాల, గజ్వేల్ ఉన్ని సహకార సంఘాలు, దుద్దెడ, వీరారెడ్డిపల్లి, చెర్లతోటపల్లి చేనేత సంఘాలు నామమాత్రంగా ఉన్నాయి.
సహకార సంఘాల
ఎన్నికలకు రంగం సిద్ధం
రెండు రోజుల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం
జిల్లాలో 18 సహకార సంఘాలు
సంతోషంలో నేత కార్మికులు


