రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఆత్మహత్య

Jun 27 2026 7:24 AM | Updated on Jun 27 2026 7:24 AM

సూసైడ్‌ నోట్‌లో పలువురి పేర్లు

కొండపాక(గజ్వేల్‌): రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. త్రీ టౌన్‌ ఎస్సై మల్లేశం కథనం ప్రకారం... దుద్దెడ గ్రామానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తుడు గుండెల్లి ఆంజనేయులు(38) కొన్నేళ్లుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఆంజనేయులుతో పాటు మరి కొందరితో కలిసి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమి సర్వే నం.655/1గా చూపించి సిద్దిపేటకు చెందిన ఓ ప్రైవేటు స్కూల్‌ యజమాని ఎడ్ల జ్యోతి, శ్రీనివాస్‌ దంపతులకు సుమారు ఆరేళ్ల క్రితం భూమిని విక్రయించి రూ. 47.87లక్షలు తీసుకున్నారు. 2022లో రెవెన్యూ అధికారులు నిర్వహించిన సర్వేలో ప్రభుత్వ భూమిగా నిర్ధారణ కావడంతో ఆంజనేయులు, ఆయన భాగస్వాములును సంప్రదించగా మరో చోట భూమిని చూపిస్తామని ఒప్పుకున్నారు. ఈ విషయంలో పంచాయితీ జరుగుతోంది. సయోధ్య కుదరకపోవడంతో కొనుగోలుదారుడు త్రీటౌన్‌ పోలీస్టేషన్‌న్లో రియల్‌ సభ్యులపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో బెయిల్‌పై విడుదలైన గుండెల్లి ఆంజనేయులుతో పాటు ముఠా సభ్యులను కొనుగోలుదారుడు భూమి విషయమై అడిగితే భూమికి బదులుగా మరో చోట భూమిని చూపిస్తామని చెప్పారు. కాగా పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందామని దాట వేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపార భాగస్వాములు కలిసి తనను ఒక్కడినే దోషిగా చూపించే ప్రయత్నం జరుగుతుందని గుర్తించిన ఆంజనేయులు కుటుంబీకులతో చెప్పుకుంటూ బాధపడ్డాడు. ఈ క్రమంలో వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం ఫాంహౌస్‌ వద్ద ఉరివేసుకున్నాడు. మృతుని భార్య సంధ్యారాణి పలువురిపై త్రీటౌన్‌ పోలీస్టేషన్‌న్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

మృతుడి వద్ద లభించిన సూసైడ్‌ నోట్‌

మృతుని వద్ద లభించిన సూసైడ్‌ నోట్‌లో ఆత్మహత్యకు గల కారకుల పేర్లు రాశారు. మరో పేజీలో కూతురి పైచదువులు చదువుకొని గొప్ప డాక్టరు కావాలన్న నోట్‌ లభించింది. కాగా సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

న్యాయం చేయాలని ఆందోళన

సిద్దిపేటజోన్‌: ఆత్మహత్య చేసుకున్న గుండెల్లి ఆంజనేయులు బంధువులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని భారత్‌నగర్‌లో శ్రీనివాస్‌రెడ్డి ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. ఆంజనేయులు ఆత్మహత్య చేసుకోవడానికి శ్రీనివాస్‌ రెడ్డి కారణమని, నాయ్యం చేయాలని రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఏసీపీ రవీందర్‌రెడ్డి అక్కడికి చేరుకొని వారితో మాట్లాడి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో మృతుని బంధువులు ఆందోళన విరమించారు.

కొండపాకలో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement