తొగుట(దుబ్బాక)/మిరుదొడ్డి(దుబ్బాక): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో బీడీ కార్మికులకిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ బీడీ, సిగార్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి భాస్కర్ డిమాండ్ చేశారు. తొగుటలో బీడీ కార్మికులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీడీ కార్మికులకు రూ.4,016 జీవన భృతి చెల్లించాలన్నారు. రిటైర్మెంట్ పెన్షన్ రూ.6 వేలకు పెంచాలని కోరారు. బీడీ పరిశ్రమపై ఆధారపడి సుమారు ఏడు లక్షల మంది జీవిస్తున్నారని, ఎన్నోయేళ్లుగా బీడీలు చుట్టినా ఆర్థికంగా మాత్రం వృద్ధి చెందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనిదినాలు తగ్గిపోయి ఉపాధి అవకాశాలు క్షీణిస్తున్నాయని వాపోయారు. బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 29న నిర్వహించే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ వసంత, బీడీ కార్మికులు అరుణ, హేమలత, లావణ్య, కవిత, జ్యోతి, లక్ష్మి పాల్గొన్నారు. మిరుదొడ్డిలోని పలు బీడీ కార్మికుల కార్ఖానాలను సీఐటీయూ మండల కార్యదర్శి మద్దెల అంజయ్య సందర్శించారు. ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. బీడీ కార్మికులు కల్యాణి, నిరీక్షణ, అలేఖ్య, కౌసల్య పాల్గొన్నారు.
29న చలో కలెక్టరేట్
బీడీ వర్కర్స్ యూనియన్ నేత భాస్కర్


