‘మల్లన్నసాగర్’ కాలనీ వాసులకు నోటీసులు
ఇంటి పన్ను చెల్లించాలంటూ హుకుం
మల్లన్నసాగర్ నిర్వాసిత కాలనీ వాసులకు మరో సమస్య వచ్చిపడింది. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈ కాలనీ ఇటీవలే అధికారికంగా విలీనమయ్యింది. కానీ వీరు మూడేళ్ల క్రితం నుంచి పన్నులు చెల్లించాల్సిందేనని అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ క్రమంలోనే కాలనీవాసులు శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. – గజ్వేల్
● నెల కిందటే అధికారికంగా విలీనం
● అయినా మూడేళ్లది చెల్లించాలని అల్టిమేటం
● గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో విచిత్ర పరిస్థితి
మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాలైన తొగుట మండలం పల్లెపహాడ్, వేములగాట్, ఏటిగడ్డకిష్టాపూర్, బ్రహ్మణ బంజేరుపల్లి, లక్ష్మాపూర్లతోపాటు కొండపాక మండలంలోని ఎర్రవల్లి గ్రామ పంచాయతీలున్నాయి. వీటి పరిధిలో మరిన్ని మధిర గ్రామాలు ఉన్నాయి. ఈ పంచాయతీలను గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్పల్లి, సంగాపూర్ గ్రామాలకు తరలించి ఆర్అండ్ఆర్ కాలనీని నిర్మించి ఇచ్చిన సంగతి తెల్సిందే. నిర్వాసిత కాలనీలో మొత్తం 7వేల పైచిలుకు ఇళ్లు ఉన్నాయి.
2026 జనవరిలో విలీనం చేసి..
భౌగోళికంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నా 2020 నుంచి గతేడాది మే నెల వరకు ఆయా గ్రామాలు పంచాయతీలుగానే కొనసాగాయి. ప్రస్తుతం ఆయా గ్రామాల పరిధిలో సుమారుగా 16వేలకుపైగా జనాభా, మరో 14వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఈ కాలనీని 2026జనవరిలో అధికారికంగా మున్సిపాలిటీలో విలీనం చేసి.. 7, 8, 9, 10, 11, 12 వార్డులను సైతం కేటాయించి మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేశారు.
నిర్వాసితుల్లో ఆందోళన
నిజానికి అధికారికంగా విలీనమైన తర్వాత ఇంటి పన్నులు చెల్లింపునకు నోటీసులు రావాల్సి ఉండగా.. 2023, అంతకు పూర్వం నుంచే పన్నులు చెల్లించాలని నోటీసులు రావడం నిర్వాసితులను ఆందోళనకు గురిచేస్తున్నది. గత గతేడాది మే నెలవరకు తాము గ్రామ పంచాయతీల పరిధిల్లోనే కొనసాగామని, అలాంటి సమయంలో మున్సిపాలిటీ నుంచి తమకు ఎలాంటి సేవలు అందలేదని, అయినా 2023నుంచి పన్నులు చెల్లించాలని నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం బీఆర్ఎస్ నాయకుడు ఎన్సీ సంతోష్ అధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. తమ కాాలనీ అధికారికంగా విలీనమైన 2026 జనవరి నుంచే పన్నులు అమలు చేయాలని వినతి పత్రంలో కోరారు.
పాలకవర్గం చొరవపైనే ఆశలు..
నిర్వాసిత కాలనీకి చెందిన ఇళ్లకు పన్నుల వాతపై మున్సిపల్ పాలకవర్గం చొరవపైనే పరిష్కారం ఆధారపడి ఉంది. వాస్తవాలను పరిగణలోకి తీసుకొని మానవతాధృక్పథంతో పాత పన్నులను తొలగించి.. అధికారికంగా విలీనం తర్వాతే వసూలు జరిగే దిశగా తీర్మానం చేసి ఉన్నతాధికారులకు పంపించాల్సి ఉంది.
నిర్వాసితులకు మూడేళ్ల కిందటి నుంచి కొందరికీ, అంతకంటే మరో ఏడాది ముందు నుంచి పన్నులు అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వం వీరికి ఇళ్లను అప్పగించే సమయంలో రిజిస్ట్రేషన్లను చేసింది. దీనివల్ల ఆటోమెటిక్... వీరికి ఐజీఆర్ఎస్ విధానంలో ఇంటి పన్ను అమల్లోకి వచ్చింది. ఈ సాంకేతిక సమస్యను అప్ప ట్లో అధికారులు పరిష్కరించకపోవడం వల్ల నేడు గుదిబండగామారింది.
‘మల్లన్నసాగర్’ కాలనీ వాసులకు నోటీసులు
‘మల్లన్నసాగర్’ కాలనీ వాసులకు నోటీసులు
‘మల్లన్నసాగర్’ కాలనీ వాసులకు నోటీసులు


